ఫొటోషూట్ కు వెళ్లి.. క్వారీ గుంతలో పడి ఇంటర్ విద్యార్థి మృతి

ఫొటోషూట్ కు వెళ్లి.. క్వారీ గుంతలో పడి ఇంటర్ విద్యార్థి మృతి

శంషాబాద్, వెలుగు: ఫొటోషూట్ కు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి మృతి చెందిన ఘటన శంషాబాద్ ఎయిర్​పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బోరబండ కు చెందిన ఇంటర్​ విద్యార్థి మీర్జా షోయబ్​ బేగ్(17) ఆదివారం తన ఫ్రెండ్స్  11 మందితో కలిసి ఫొటోషూట్ కోసం కొత్వాల్ గూడలో బాహుబలి అని పిలిచే క్వారీ గుంతల వద్దకు వెళ్లాడు.

ఫొటోషూట్ చేస్తుండగా షోయబ్​ బేగ్​ ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి  గజ ఈతగాళ్లతో  గాలించగా సాయంత్రం అతని డెడ్ బాడీ లభ్యమైంది. మృతుడి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.  ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ప్రమాదకరమని బోర్డు ఏర్పాటు చేసినా..

కొత్వాల్ గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ సమయంలో భారీ ఎత్తున మట్టి, గ్రానైట్ తవ్వకాలతో 20, 30 ఫీట్ల లోతులో గోతులు ఏర్పడ్డాయి. ఈ ప్రదేశం ఆకట్టుకునేలా ఉండడంతో పలు షూటింగ్​లు జరుగుతున్నాయి. యూట్యూబ్, గూగుల్లో సెర్చ్​చేసి మరీ పలువురు ఇక్కడికి వచ్చి, ఫొటోలు దిగుతున్నారు. ఇదివరకు పలువురు ప్రమాదవశాత్తు చనిపోయారు. అధికారులు ఏడెనిమిదేళ్ల కిందనే ఈ ప్రాంతం ప్రమాదకరమని బోర్డు ఏర్పాటు చేశారు. అయినా చాలామంది వెళ్తున్నారు.