తేజస్ పైలెట్ నమాన్ష్ కుటుంబమంతా దేశ సేవలోనే.. తండ్రి రిటైర్డ్ ఆర్మీ.. భార్య ఎయిర్ ఫోర్స్‎లో ఆఫీసర్..!

తేజస్ పైలెట్ నమాన్ష్ కుటుంబమంతా దేశ సేవలోనే.. తండ్రి రిటైర్డ్ ఆర్మీ.. భార్య ఎయిర్ ఫోర్స్‎లో ఆఫీసర్..!

ధర్మశాల/చెన్నై: దుబాయ్​ఎయిర్​షోలో ప్రాణాలు కోల్పోయిన తేజస్​జెట్​పైలెట్, వింగ్​కమాండర్​నమాన్ష్​శ్యాల్​అంత్యక్రియలు ఆదివారం జరుగనున్నాయి. హిమాచల్​ప్రదేశ్‎లోని కాంగ్రా జిల్లా పతియాల్కర్​ఆయన స్వగ్రామం. శుక్రవారం ఎయిర్​షోలో నమాన్ష్​చనిపోయారన్న వార్త తెలిసి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. నమాన్ష్​ తండ్రి జగన్నాథ్​ శ్యాల్​, తల్లి వీణ. రిటైర్డ్​ప్రిన్సిపాల్​అయిన జగన్నాథ్ శ్యాల్.. టీచింగ్​ఫీల్డ్‎లోకి వచ్చే ముందు ఇండియన్​ ఆర్మీలో పనిచేశారు. 

35 ఏండ్ల నమాన్ష్‎కు 2014లో పెండ్లయింది. ఆయనతోపాటు ఆయన భార్య అఫ్షాన్​కూడా ఇండియన్​ఎయిర్​ ఫోర్స్​ (ఐఏఎఫ్​)లో పనిచేస్తున్నారు. వీరికి ఏడేండ్ల కూతురు ఆర్య ఉంది. సొంత రాష్ట్రం హిమాచల్‎లోని హమీర్​పూర్​ సైనిక్​ స్కూల్‎లో నమాన్ష్​విద్యాభ్యాసం సాగింది. ఆయన అథ్లెట్​కూడా. విధి నిర్వహణలో భాగంగా తమిళనాడులోని కోయంబత్తూర్‏లో భార్య, బిడ్డతో కలిసి నమాన్ష్ ఉంటున్నారు. నమాన్ష్​భార్య ట్రైనింగ్​కోసం ఇటీవల కోల్‎కతాకు వెళ్లింది. 

దీంతో పాపను చూసుకునేందుకు రెండువారాల కిందట్నే నమాన్ష్ తల్లిదండ్రులు స్వగ్రామం హిమాచల్​లోని పతియాల్కర్​ నుంచి  కోయంబత్తూర్​కు వచ్చారు. ‘‘నేను శుక్రవారం ఉదయం నా కొడుకుతో ఫోన్​లో మాట్లాడాను. దుబాయ్​ ఎయిర్​షోను టీవీలో కానీ, యూట్యూబ్​లో కానీ చూడండని వాడు చెప్పాడు.  సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్​లో ఎయిర్​ షో గురించి వెతుకుతుంటే.. విమానం కూలిందన్న వార్త కనిపించింది.

వెంటనే ఏం జరిగిందో తెలుసుకోవడానికి మా కోడలికి ఫోన్​ చేశాను. ఆమె ఎయిర్​ఫోర్స్​ఆఫీసర్. ప్రస్తుతం కోల్‎కతాలో శిక్షణ తీసుకుంటున్నది. నేను మా కోడలికి ఫోన్​ చేస్తుండగానే.. ఆరుగురు ఎయిర్​ఫోర్స్​సిబ్బంది మా ఫ్లాట్​కు వచ్చారు. అప్పుడే నాకు అర్థమైంది.. మా బాబుకు ఏదో జరిగిందనీ” అంటూ జగన్నాథ్​శ్యాల్​కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, నమాన్ష్​పుట్టిపెరిగిన పతియాల్కర్‎లో తీవ్ర విషాదం అలుముకున్నది. 

శుక్రవారం తేజస్​ జెట్​కూలిన విషయం తెలిసి తన అన్న జగన్నాథ్​ శ్యాల్‎కు ఫోన్​చేశానని.. అప్పటికీ ఆ విషయం ఆయనకు తెలియదని పతియాల్కర్​వాసి, నమాన్ష్​ చిన్నాన్న జోగీంద్రనాథ్​ శ్యాల్​ తెలిపారు. ఆదివారం స్వగ్రామానికి నమాన్ష్​ భౌతిక కాయం వస్తుందని, అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.