మీకు తెలుసా : హైదరాబాద్సిటీకి దగ్గరలో మరో కంచి.. ఇక్కడ బంగారు, వెండి బల్లులకు పూజలు

మీకు తెలుసా : హైదరాబాద్సిటీకి దగ్గరలో మరో కంచి.. ఇక్కడ బంగారు, వెండి బల్లులకు పూజలు

మహా నగరానికి కూత వేటు దూరంలో..పది శతాబ్దాల చరిత్ర గల ఆలయం భక్తుల నిత్య పూజలతో అవ్యక్త అనుభూతిని కలిగిస్తోంది... తమిళనాడు కంచిని పోలిన ఆలయమే ఈ కొడకంచి... కంచిలో ఉన్నట్టే బంగారు, వెండి బిల్లులు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువు దీరిన ఆదినారాయణ మూర్తి..  దర్శనం విశేష ఫలదాయకం..

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరి రిలోని జిన్నారం మండలంలో నిత్యం భక్తుల పూజలతో కంచి తరహాలో విరాజిల్లుతున్న ఓ ఆలయం మన తెలంగాణలో దర్శనమిస్తుంది. కంచికి వెళ్లకున్నా కొడకంచికి వెళ్లాలనేది నానుడి ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ దేవాలయానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. ఇంత చరిత్ర కలిగిన ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

తెలంగాణ కంచిగా పేరుగాంచిన ఈ దేవాలయం జిన్నారం మండలంలో కోలువుదీరిం ది. జిన్నారానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయంలో ఆదినారాయణమూర్తి శ్రీదేవి. భూదేవి సమేతుడై కొలువుదీరాడు. తొమ్మిది వందల ఏళ్ళ క్రితం నిర్మితమైన ఈ దేవాలయం బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియక పోయినా గత పదేళ్ళ నుంచి బాగా ప్రా చుర్యంలోకి వచ్చింది. కంచి మహా క్షేత్రానికున్న ప్రాధాన్యతే ఈ కొడకంచి దేవాలయానికిఉన్న ప్రత్యేకత. దేశవిదేశాల భక్తులు సైతం కొడకంచిని దర్శించి తరిస్తున్నారు.

స్థలపురాణం...

భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ కొడకంచి ఆలయానికి పురాతన ప్రాశస్త్యం ఉన్నా ఈ మధ్య కాలంలోనే ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందుతోంది. భక్తుల కోరికలు తీర్చుతూ వారికి సుఖసంతోషాలను ప్రసాదిస్తున్న ఆ ఆదినారాయణుడి ప్రసన్నతే దానికి కారణం. విష్ణు సహస్ర నామంలో భీష్మా చార్యులు తెలిపిన ప్రకారం ధర్మాన్ని అనుసరించి జీవులను ఉద్దరించడానికి మహా విష్ణువు ఎత్తిన అవతారమే అదినారాయణ స్వామి రూపం.   

ఆనాడు ఈ ప్రాంతాన్ని పరిపా లించిన అల్లాని రాజు  వంశస్తులకు ఆదినారా యణ స్వామి కుల దైవం.   అల్లాని రామోజీరావు అనే రాజుకు అదినారాయణ స్వామి కలలో కనిపించి పక్కనే ఉన్న అడవిలో తన విగ్రహంశోభాయమానంగా ఉందని తీసుకొన్ని ప్రతిష్టించి పూజలు చేయాలని ఆదేశించినట్లు స్థల పురాణం. స్వామి ఆదేశానుసారం అడవిలో వెతుకగా ఒక పుట్టలో స్వామి విగ్రహం లభించగా విగ్రహాన్ని తీసుకొన్ని ఇక్కడ ప్రతిష్టించారని ఆ వంశస్థుల ద్వారా తెలుస్తోంది. ఆనాటి అల్లాని వంశస్థులు ఒక్కొక్కరిగా ఆదినారాయణ స్వామికి గుడి కట్టడం మొదలు పెట్టి మూడోతరం వరకు కొడకంచి దేవాలయాన్నిపూర్తి చేశారు.  

ఒక్క రాయితో..

కంచి ఆలయాన్ని పోలిన ఆలయం లాగానే ఈ ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని ఏకశిలా నిర్మాణం చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత నారాయణు మూర్తి విగ్రహాలకు ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు జరిపించి ప్రతిష్టించారు. అలాగే కంచిలో ఉన్నట్లే వెండి, బంగారు బల్లులను గర్భగుడి పై భాగంలో ప్రతిష్టించి వాటికి కూడా పూజలు జరుపుతున్నారు. 

నాలుగు స్తంభాల రాజగోపురం గత వైభవానికి ప్రాభవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఆలయ ప్రాంగణం కళ శోభాయమానంగా, అపురూప శిల్ప కళ సమన్వితంగా విరాజిల్లుతుంది. విశాలమైన ముఖ మంటపం ఈ దేవాలయంలో ప్రత్యేక ఆకర్షణ ఏకశిల మూర్తిగా నిర్మించబడిన గర్భగుడి పక్కనే లక్ష్మీదేవి ఆలయం, మరో పక్క గోదా దేవి ఆలయాలు ఉన్నాయి. 

గర్భగుడికి ఎదురుగా నల్లరాతితో నిర్మించిన ద్వాదశాల్వాల్ల సన్నిధిని ఏర్పాటు చేశారు. దేవాలయం లోపల ఉన్న మేడి వృక్షం కింద శివాలయాన్ని నిర్మించారు. కోనేరు ప్రాకార మండపం, మరోపక్క యఙ్ఞాది పూజల కోసం నిర్మించిన ప్రత్యేక నిర్మాణాలు ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాయి.

పూజలు..

వైష్ణవ ఆలయంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ కొడకంచి దేవాలయంలో బంగారు, వెండి బల్లులను స్పర్శిస్తే దోషాలన్ని పోయి మంచి కలుగుతుందని భక్తుల విశ్వాసం... కంచి దేవాలయంలో ఎలాగైతే దోష నివారణ పూజలు చేస్తారో కొరకంచిలో కూడా అలాగే పూజలు చేస్తుంటారు...ప్రతి సంవత్సరం మాఘమాసంలో  ఏకాదశి వరకు కొడకంచి దేవాలయంలో బ్రహ్మోత్సవాలను అట్టహా సంగా నిర్వహిస్తారు. 

వైష్ణవ సంబంధ పర్వదినాలన్నీ ఈ దేవాలయంలో జరుపుతారు.  బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం లక్షలమంది భక్తులు హాజరై దోష నివారణ పూజల్లో పాల్గొంటారు. దేశంలోని అన్నిరాష్ట్రాల  నుంచి తండోప తండాలుగా భక్తులు వచ్చి ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తుండడం అనవాయితీగా మారింది. స్థానికులు ఏ పని ప్రారంభించినా కొడకంచి దేవాలయంలో పూజలు చేశాకే మొదలు పట్టడం ఇక్కడ ఆచారం.