
ఎన్నికల గడువు సమీపిస్తున్నా చట్ట సవరణ చేయని సర్కార్
రెండేండ్లుగా పెండింగ్లో 9.24 లక్షల అప్లికేషన్లు
పట్టాలు రాక రైతుబంధు, రైతు బీమాకు దూరం
కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో సాదాబైనామా దరఖాస్తుల కథ కంచికి చేరినట్లే కనిపిస్తోంది. పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిన ప్రభుత్వం.. భూసమస్యల పరిష్కారాన్ని పెండింగ్ లో పెట్టేసింది. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి అడ్డంకిగా మారిన కొత్త రెవెన్యూ చట్టానికి ఆగస్టు మొదటి వారంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ సవరణ చేయకపోవడంతో ఇప్పట్లో ఈ అప్లికేషన్లకు మోక్షం లభించేలా కనిపించడం లేదు. పెద్ద మనుషుల సమక్షంలో తెల్లకాగితాలపై రాసుకుని వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోలు చేసిన వారికి పట్టాదారు పాస్ బుక్స్ జారీచేసేందుకు ప్రభుత్వం 2016లో ఒకసారి, 2020 అక్టోబర్ లో మరోసారి మీ సేవా సెంటర్ల ద్వారా అప్లికేషన్లు స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తంగా సుమారు 20 లక్షల ఎకరాల భూములకు సంబంధించి 9.24 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా.. వీటిలో ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 1.12 లక్షల మంది రైతులు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 35, 580, జగిత్యాల జిల్లాలో 35,010, కరీంనగర్ జిల్లాలో 26,871, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15,056 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. పాసు బుక్స్ రాకపోవడంతో రైతులు రైతుబంధు, రైతుబీమా లాంటి స్కీమ్ లకు నోచుకోవడం లేదు. భూమి ఉన్నా బ్యాంకు లోన్లు పొందలేకపోతున్నారు. మరోవైపు సాదాబైనామా కింద చాలా ఏండ్ల క్రితమే భూమి అమ్మిన యజమానులు పాత రికార్డులను చూపెట్టి దొడ్డిదారిలో తమ పేరిట పట్టాలు చేయించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టమే ప్రధాన అడ్డంకిగా మారింది. చట్ట సవరణ చేసి ఈ భూములకు పట్టాలిచ్చే అవకాశమివ్వాలని బాధిత రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
తెల్లకాగితాలపైనే అగ్రిమెంట్లు..
రిజిస్ట్రేషన్ విధానంపై అవగాహన లేక కొందరు, రిజిస్ట్రేషన్ ఖర్చులను భారంగా భావించి మరికొందరు గతంలో పెద్దమనుషులు, సాక్షుల సమక్షంలో నోటరీపై, తెల్లకాగితాలపై రాసుకుని వ్యవసాయ భూములను కొనేవారు. తెల్ల కాగితాలపై రాసుకున్నప్పటికీ.. ఈ అగ్రిమెంట్లను రెవెన్యూ ఆఫీసర్లకు చూపెట్టి పహణీలో కాస్తుదారు కాలమ్ లో పేర్లు నమోదు చేయించుకునేవారు. మరికొందరు రైతులు రాసుకున్న కాగితం ఉందనే ధీమా తో రెవెన్యూ ఆఫీసుల వైపు వెళ్లేవారే కాదు. కేవలం ఇవి తెల్ల కాగితాలపై రాసుకున్నవి కావడంతో వారికి రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ కాలేదు. దీంతో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పాసు బుక్స్ కూడా జారీ కాలేదు. ఇలాంటి రైతులు లక్షల్లోనే ఉన్నారు.
రెండున్నరేండ్లు దాటినా పెండింగ్లోనే..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు రెండు సార్లు సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించారు. 2014 జూన్2 లోపు తెల్లకాగితాలపై రాసుకున్న లావాదేవీల రెగ్యులరైజేషన్ కోసం 2016లో మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్లు స్వీకరించగా.. 11.19 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వారిలో 6.15 లక్షల అప్లికేషన్లను పరిష్కరించి ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించింది. సరైన ఆధారాలు లేవని 3 లక్షల అప్లికేషన్లను రిజెక్ట్ చేసింది. ఇవి పోనూ మరో 2.4 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోయాయి. సమాచారం లేక దరఖాస్తు చేసుకోని రైతులు కూడా లక్షల్లో ఉండడంతో ఎమ్మెల్యేలు, మంత్రుల విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10 వరకు సాదాబైనామా అప్లికేషన్లను స్వీకరించింది. దీంతో మరో 7.20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. పాత వారితో కలిపితే మొత్తం అప్లికేషన్ల సంఖ్య 9.24 లక్షలకు చేరింది. ఇవి స్వీకరించి రెండున్నరేండ్లు దాటినా ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో బాధిత రైతులు సుమారు 20 లక్షల ఎకరాలపై రైతు బంధును కోల్పోతున్నారు. అలాగే రైతుబీమాకు నోచుకోవడం లేదు. పంట అమ్మకం, బ్యాంక్ లోన్ల విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు.
అడ్డంకిగా మారిన కొత్త రెవెన్యూ చట్టం..
హైదరాబాద్ రాష్ట్రంలో రూపుదిద్దుకున్న హైదరాబాద్ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ -1948 ప్రకారం తెల్లకాగితాలపై రాసుకుని కొనుగోలు చేసిన భూములకు పట్టాలిచ్చే అధికారం తహసీల్దార్లకు ఉండేది. అలాగే ప్రతి ఏటా గ్రామాల్లో జమాబందీ నిర్వహించడం ద్వారా నిజమైన కాస్తుదారులను గుర్తించి తహసీల్దార్లు పట్టాదారు పాస్పుస్తకం జారీ చేసేవారు. 1971లో ఈ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం సవరించి రిజిస్ట్రేషన్ పేపర్లు ఉంటేనే పట్టాదారు పాస్పుస్తకం ఇవ్వాలనే నిబంధనతో ఆర్వోఆర్ యాక్ట్ -1971ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో తెల్లకాగితాలపై లావాదేవీలు చెల్లకుండాపోయాయి. 1989లో ఈ చట్టాన్ని సవరించి సాదాబైనామాలను పరిష్కరించే అధికారాన్ని మళ్లీ తహసీల్దార్లకు అప్పగించారు. ఈ సవరణ ఆధారంగానే ఉమ్మడి ఏపీలో 1989, 2000లో, తెలంగాణ ఏర్పాటయ్యాక 2016, 2020లో సాదాబైనామా అప్లికేషన్లు స్వీకరించారు. అయితే, 2020 అక్టోబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ధరణిలో డిజిటల్ రూపంలో ఉన్న రికార్డులనే రెవెన్యూ రికార్డులుగా పరిగణిస్తోంది. సాదాబైనామా దరఖాస్తులు ఈ చట్ట పరిధిలోకి రావు. కొత్త చట్టం ప్రకారం పాత ఆర్వోఆర్ చట్టం రద్దు కావడంతో సాదాబైనామా సమస్యలు పరిష్కరించే మార్గం లేకుండా పోయింది.. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా ప్రశ్నించింది. దీంతో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంపై అనిశ్చితి ఏర్పడింది. కొత్త చట్టాన్ని సవరిస్తే తప్పా సుమారు 20 లక్షల ఎకరాలకు పట్టా పాసు బుక్స్ జారీ అయ్యే ఛాన్స్ లేదు. రెండేండ్లలో అనేక సార్లు కేబినెట్ మీటింగ్ జరిగినా, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినా కొత్త రెవెన్యూ చట్టంలో సవరణల గురించి చర్చించలేదు. ఆగస్టు ఫస్ట్ వీక్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ చట్ట సవరణ చేయకపోవడం, ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఈ అప్లికేషన్లను ఇప్పట్లో పరిష్కరించే పరిస్థితి కనిపించడం లేదు.
మోసాలకు ఆస్కారం..
సాదాబైనామా దరఖాస్తులు పెండింగులో ఉండ డంతో.. భూమి అమ్మిన రైతులకు పట్టాదారు పాస్ బుక్స్ జారీ కాలేదు. కానీ ధరణి పోర్టల్ లో మాత్రం అమ్మిన రైతుల పేర్లే కనిపిస్తున్నాయి. డిజిటల్ సైన్ ఇంకా కాలేదని, ఆధార్, ఈకేవైసీ పెండింగ్ లో ఉన్నట్లు చూపిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు రెవెన్యూ ఆఫీసర్లతో కుమ్మక్కయి మోసపూరితంగా పాస్ బుక్స్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. భూముల విలువ పెరగడంతో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అమ్మకందారులకు, కొనుగోలుదారులకు గొడవలు తలెత్తుతున్నాయి.
చట్ట సవరణే శరణ్యం..
చట్ట సవరణ చేయకుండా సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించడం సాధ్యం కాదు. 1989లో ఆర్వోఆర్ యాక్ట్ లో చేర్చిన సెక్షన్ 5 ఏ ప్రొవిజన్ను కొత్త చట్టంలో చేర్చితే సరిపోతుంది. తహసీల్దార్లకు లేదంటే ఆర్డీఓలకైనా అధికారాలు ఇవ్వాలి. కలెక్టర్లే 9.24 లక్షల దరఖాస్తులు పరిష్కరించాలంటే సాధ్యం కాదు. లేట్ చేస్తున్న కొద్దీ ల్యాండ్ వాల్యూ పెరిగి కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య గొడవలు పెరుగుతాయి. -
భూమి సునీల్, భూచట్టాల నిపుణుడు
రూ.2 వేల కోట్లు కోల్పోతున్న రైతులు
సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కాక వేలాది మంది రైతులు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. కొత్త రెవెన్యూ చట్టాన్ని సవరిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. పాస్ బుక్స్ రాకపోవడంతో రైతుబంధు, రైతు బీమాకు నోచుకోవడం లేదు. క్రాప్ లోన్లు రావడం లేదు. ఒక్క రైతు బంధు రూపంలోనే రూ.2 వేల కోట్లు కోల్పోతున్నారు.
- మన్నె నర్సింహారెడ్డి, ధరణి సమస్యల వేదిక