
- యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో130 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి: మంత్రి ఉత్తమ్
- కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాపై సమీక్ష
కరీంనగర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు మూసేసినా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్నా.. ఈ సారి వడ్ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యాసంగి సీజన్ లో 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ యాసంగిలో ఈ స్థాయిలో పంట పండలేదన్నారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లు సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల పెద్ద ఎత్తున పంటలు పండాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై కరీంనగర్ కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, విజయ రమణారావు, ఠాకూర్ మక్కాన్ సింగ్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని అన్యాయం
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు రూ.30 వేల కోట్లతో పూర్తయ్యేదని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఆర్థికంగా తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డిజైన్ చేసింది.. కట్టింది.. కూలింది బీఆర్ఎస్ హయాంలోనేనని గుర్తు చేశారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు మూడేండ్లలో కూలిపోవడం కూడా ఒక రికార్డేనన్నారు. విజిలెన్స్, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్లు కూడా చెల్లవని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని.. జస్టిస్ చంద్రఘోస్ ఆధ్వర్యంలో జ్యుడీషియల్ విచారణ సాగుతోందని, కమిషన్ నోటీసులు ఇవ్వగానే ఏదోదే మాట్లాడుతున్నారని విమర్శించారు.
సిల్ట్ తో ఎస్సారెస్పీ సామర్థ్యం తగ్గిందని, రిజర్వాయర్ లో పూడికతీత, డీ సిల్టేషన్ ఆధునిక పద్ధతుల్లో పూర్తి చేసి మునుపటి సామర్థ్యం తీసుకొస్తామన్నారు. అలాగే, కడెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో సిల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులను వినియోగిస్తామని తెలిపారు. మే 28 వరకు రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోళ్లకు సంబంధించి రూ.13 వేల కోట్లు చెల్లించామని, గత ప్రభుత్వ హయాంలో ఇదే సమయం 2023 మే 28 నాటికి రూ.3,500 కోట్లు మాత్రమే చెల్లించారని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు.