ఉద్యమకారుల పాదయాత్ర..అరెస్ట్ చేసిన పోలీసులు

ఉద్యమకారుల పాదయాత్ర..అరెస్ట్ చేసిన పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం, రోల్లపాడు వద్ద తెలంగాణ ఉద్యమ ఐక్యవేదిక నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తమ సమస్యల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి విన్నవించుకునేందుకు పాల్వంచ నుండి ప్రగతి భవన్ వరకు తెలంగాణ ఉద్యమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో తెలంగాణ సాధన కొరకు జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పది మంది పాల్గొన్నారు. 

టేకులపల్లి మండలం, రోలపాడు స్టేజి వద్ద ఇల్లందు, టేకులపల్లి పోలీసులు పాదయాత్రగా వచ్చే నాయకులను అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఐక్యవేదిక నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ఐక్యవేదిక నాయకులను అరెస్టు చేసి గుండాల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పాదయాత్ర చేస్తున్న ఉద్యమకారుల డిమాండ్స్ ఇవే:

2001లో ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడ్డ తెరాస పార్టీ గులాబీ జెండా మోస్తూ రాష్ట్రం ఏర్పాటుకోసం పోరాటాలు చేసి ఎన్నో కష్టాలను ఎదుర్కొని, పోలీసు నిర్భందాలు, లాటీ చార్జీలతోపాటు జైళ్ళకు సైతం వెళ్ళిన మేమందరం ఆర్ధికంగా, సామాజికంగా పూర్తిగా చితికిపోయి ఉన్నాం. కావున మాకు సామాజికంగా, ఆర్ధికంగా సహాయంచేసి  ప్రభుత్వం ఆదుకోవాలని పాదయాత్ర ద్వారా తెలియజేస్తున్నామని ఫ్లెక్సీలను ప్రదర్శించారు.

  • నాటి ఉద్యమకారులకు ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని చేతివృత్తులు, ఉపాధి కోల్పోయి ఆర్ధికంగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న మాకు ఉపాధి అవకాశాల కోసం కనీసం 10లక్షల రూపాయల ఆర్ధిక సహాయం చేయాలని కోరుతున్నారు.
  • తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి నెల కనీసం రూ.10వేల రూపాయల పెన్షన్ అమరవీరుల కుటుంబానికి నెలకు రూ.20వేలు ఇవ్వాలని కోరుతున్నారు.
  • తెలంగాణ ఉద్యమకారులందరికీ వైద్య సౌకర్యాలతో పాటు ఉద్యమకారుల పిల్లలకు ఉపకారవేతనాలు, ఫీజు రీయంబర్స్మెంట్ మంజూరు చేయాలని నిరుద్యోగులైన ఉద్యమకారుల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
  • తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు, రైళ్ళలో ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పించాలని తమ డిమాండ్ లో పేర్కొన్నారు.