హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు ఉద్యమకారులు గురువారం ఉదయం గాంధీ భవన్ ఎదుట భిక్షాటన చేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ సర్కార్ వచ్చి రెండున్నరేండ్లు గడిచినా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని ఆరోపించారు. ఉద్యమకారులందరికీ వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిరసన చేస్తున్న తెలంగాణ ఉద్యమకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

