యూరియాతో సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం : వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య

యూరియాతో సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం : వర్సిటీ వీసీ అల్దాస్  జానయ్య
  • వ్యవసాయ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య హెచ్చరిక
  • అవసరానికి మించి వాడవద్దని రైతులకు సూచన

గండిపేట, వెలుగు: రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నారని తెలంగాణ అగ్రికల్చరల్  వర్సిటీ వీసీ అల్దాస్  జానయ్య  అన్నారు. ఎక్కువ దిగుబడులు వస్తాయనే అపోహ వల్ల రైతులు యూరియా ఎక్కువగా వాడుతున్నారని, అది సరికాదని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. అధిక యూరియా వాడకం వల్ల దిగుబడులు పెరగకపోగా పంటల్లో రసాయన అవశేషాలు నిండిపోయి మానవ ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని, శాస్త్రీయ ప్రయోగాలు దీనిని నిరూపించాయని వెల్లడించారు. .

నత్రజని అవసరమే కానీ దానికి యూరియా ఎక్కువ వాడాల్సిన అవసరం లేదని, చౌకగా దొరుకుతుందనే కారణంతో ఎక్కువ వాడవద్దని సూచించారు. అవసరమైన మేరకే యూరియా వాడి నేల, నీటి నాణ్యత కాపాడి భవిష్యత్  తరాల ప్రయోజనాలు పరిరక్షించాలని కోరారు. అధిక యూరియా వాడకంతో పండిన ఆహారం తినడం వల్ల కాన్సర్,  కిడ్నీ వ్యాధులు వస్తాయని, యువతలో సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో యునైటెడ్  నేషన్స్  ఎన్విరాన్‌‌‌‌మెంటల్  అసెంబ్లీ  నివేదికలో ఈ అంశం పేర్కొన్నట్టు తెలిపారు.