తెలంగాణ, ఏపీ మధ్య వచ్చే వారం నుంచి బస్సులు!

తెలంగాణ, ఏపీ మధ్య వచ్చే వారం నుంచి బస్సులు!

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు షురూ కానున్నాయి. వచ్చే వారం నుంచి బస్సులు నడిపేందుకు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు నడిపేందుకు నిర్ణయించారు. మొత్తం నాలుగు దశల్లో సర్వీసులను అమల్లోకి తేనున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో వచ్చే వారం నుంచి 256 బస్సులు నడపనున్నట్టు ఏపీ అధికారులు ప్రకటించారు. తెలంగాణ ఆర్టీసీ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రిపేర్​ కాకుండానే భేటీకి వెళ్లిన తెలంగాణ అధికారులు.. ఎప్పటి నుంచి, ఎన్ని బస్సులు నడపాలి, ఏయే రూట్లలో నడపాలి అనేది చెప్పలేకపోయారు. ఏపీ అన్నీ వివరంగా చెబుతుంటే మన అధికారులు తెల్లముఖం వేసినట్టు బస్​భవన్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అంతర్రాష్ట్ర ఒప్పందానికీ ఓకే

గురువారం విజయవాడలో ఇంటర్ స్టేట్ బస్సు సర్వీసులపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఏపీతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు. ఈ విషయం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ కంటే ఏపీ బస్సులు ఎక్కువ కిలోమీటర్లు తిరుగుతున్నాయి. తెలంగాణలో ఏపీ బస్సులు 3 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంటే, తెలంగాణ బస్సులు ఏపీలో 1.5 లక్షల కిలోమీటర్లు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో ఆదాయం రావడం లేదని అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు. కరోనాతో బస్సులు ఆగిపోగా, ఇంటర్ స్టేట్ ఒప్పందం చేసుకోవడానికి ఇదే సమయం అని సీఎం ఇటీవల జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి లెటర్ కూడా రాసింది. అంతర్రాష్ట్ర నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకునేందుకు రెండు రాష్ట్రాలు ప్రాథమికంగా అంగీకరీంచినట్లు సమాచారం. ఏపీ బస్సులు ఎక్కువగా తిరగకుండా “సమన్యాయం పద్ధతి”న బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నెల23న హైదరాబాద్ బస్ భవన్ లో రెండు రాష్ట్రాల ఎండీలు సమావేశమై చర్చించి, ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు. అదే రోజు అన్నింటిపై స్పష్టత రానుంది. తర్వాత సీఎంలు, రవాణా మంత్రులకు మీటింగ్ వివరాలులను అధికారులు వివరించనున్నారు. వారి అనుమతితో ఒప్పందం ఫైనల్​ కానుంది.

2011 ఫైనల్ మ్యాచ్ ను శ్రీలంక అమ్మకుంది