ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబ‌ర్ వ‌న్ గా తెలంగాణ : ఎఫ్‌సీఐ

ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబ‌ర్ వ‌న్ గా తెలంగాణ : ఎఫ్‌సీఐ

దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని భారత ఆహార సంస్థ(ఎఫ్.సి.ఐ.) సిఎండి డివి ప్రసాద్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని అభినందించారు. 2020 యాసంగిలో తాము సేకరించిన మొత్తం ధాన్యంలో 63 శాతం కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి, మిగతా అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 37 శాతం సేకరించినట్లు డివి ప్రసాద్ శుక్రవారం ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఈ సారి ప్రభుత్వ రంగ సంస్థలు రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిపాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఎఫ్.సి.ఐ. ఈ యాసంగిలో ఇప్పటిదాకా 83.01 లక్షల టన్నులు సేకరించగా, అందులో తెలంగాణ రాష్ట్రం నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించినట్లు స్పష్టం చేశారు. ఈ సారి ఎఫ్.సి.ఐ. 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో సగానికి పైగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సమకూర్చిందని అభినందించారు.

రైతులకు ముఖ్యమంత్రి అభినందన

దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదగడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాము సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచి సేకరించిందే అత్యధిక భాగమని ఎఫ్.సి.ఐ. ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగునీటి లభ్యతను, ఉచిత విద్యుత్తును సమర్థవంతంగా వినియోగించుకున్న తెలంగాణ రైతులు తమ వృత్తి నైపుణ్యంతో పంటలు పండించారని అభినందించారు.