- కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల ‘బీమా’ ధీమా
- ప్రీ -ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత బ్రేక్ ఫాస్ట్ ..
- ఇంటర్ స్టూడెంట్లకూ మిడ్ డే మీల్స్
- విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ‘సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం’
- ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్లెస్ హెల్త్స్కీమ్.. రూ.1.20 కోట్ల ప్రమాద బీమా
- ఈసారి కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్లు
- మౌలిక వసతులకు రూ. 47,267 కోట్ల ‘క్యాపిటల్’ బూస్ట్
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు పోసేలా
- వ్యవసాయం, పంచాయతీరాజ్కు భారీ కేటాయింపులు
- సంక్షేమం, అభివృద్ధికి సమతూకంలా 3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్
- బడ్జెట్ స్వరూపం మొత్తం బడ్జెట్ 3,24,234
- రెవెన్యూ వ్యయం 2,34,406
- మూల ధన వ్యయం 47,267
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల ఆశల వారధిగా, ప్రగతి సారథిగా ప్రభుత్వం 2026–-27 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయి బడ్జెట్ను ఆవిష్కరించింది. అసెంబ్లీ వేదికగా శుక్రవారం ప్రవేశపెట్టిన రూ. 3,24,234 కోట్ల పద్దులో అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని సమతూకం చేసింది. వివిధ సంక్షేమ పథకాలు, గ్యారంటీలతో సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూనే.. మౌలిక వసతుల కల్పన కోసం మూలధన వ్యయం కింద ఏకంగా రూ. 47,267 కోట్లు కేటాయించింది.
ప్రభుత్వం ఈసారి సుమారు రూ.7 వేల కోట్లతో 8 కొత్త స్కీమ్లను తీసుకొచ్చింది. వీటిలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ అత్యంత కీలకంగా మారింది. రాష్ట్రంలోని కోటీ 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత బీమా ధీమా కల్పించింది.
ఆయా కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే ఫ్యామిలీ రోడ్డున పడకుండా సర్కారు తరఫున భరోసా దక్కనున్నది. ఇందుకు తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు కేటాయించింది. దీనికి తోడు ‘చేయూత’ పథకం కింద ఈ సారి కొత్తగా 2 లక్షల పింఛన్లను మంజూరు చేయనున్నట్టు సర్కారు ప్రకటించింది. తద్వారా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు సామాజిక భద్రత దక్కనున్నది.
విద్యలో విప్లవాత్మక అడుగు..
సీఎం నిర్వహిస్తున్న విద్యాశాఖలో ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన అడుగు వేసింది. ప్రీ- ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులందరికీ వారానికి 3 రోజులు పాలు, 3 రోజులు రాగి జావతో కూడిన ‘ఉచిత బ్రేక్ ఫాస్ట్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. పౌష్టికాహార లోపాన్ని నివారించడంతోపాటు హాజ రు శాతాన్ని పెంచడమే ఈ పథకం లక్ష్యమని ప్రకటిం చారు.
దీనికి తోడు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ల్లో కొత్తగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించబోతున్నారు. ఎంపిక చేసిన పాఠశాలలను సకల సౌలతు లు, డిజిటల్ ఉపకరణాలు, సొంత రవాణా వ్యవస్థతో కూడిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు’గా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి పెంచే ప్రయత్నం చేశారు.
యువ తకు కేవలం విద్యే కాకుండా, ‘సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం’ ద్వారా విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం దేశంలోనే తొలి సారిగా రూ. 1.20 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని, క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ను ప్రవేశపెట్టడం ద్వారా దాదాపు 23.51 లక్షల మందికి ప్రభుత్వం భరోసా కల్పించింది.
మరోవైపు అభివృద్ధిని కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా వికేంద్రీకరణ దిశగా రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే 3 ఆర్థిక జోన్లుగా విభ జించగా.. నగర శివార్లలో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ హంగులతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇందుకు అనుసంధానంగా మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) పనులకు భారీగా నిధులు కేటాయించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ. 2,654 కోట్లు కేటాయించడం ద్వారా నగరాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. రోడ్లు, భవనాలు పంచాయతీ రాజ్ మౌలిక వసతుల కోసం ఈ సారి భారీ కేటాయింపులు చేయడం ద్వారా రాష్ట్ర నలుమూలలా రవాణా వ్యవస్థ మెరుగుపడే అవకాశముంది.
ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక సంక్షేమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు జనాభాకు తగ్గట్టుగా నిధులు కేటాయించడం ద్వారా సామాజిక న్యాయం పాటిస్తూనే, మహిళా శక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించే ప్రయత్నం చేసింది. మొత్తం మీద తాజా బడ్జెట్.. అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే, మూలధన వ్యయం పెంచడం ద్వారా శాశ్వత ఆస్తుల కల్పన దిశగా పక్కా రోడ్ మ్యాప్ను ఆవిష్కరించినట్టు ఆర్థిక నిపుణులు
చెప్తున్నారు.
8 స్కీమ్స్కు 7,592 కోట్లు..
కొత్తగా అమలు చేయనున్న 8 పథకాలకు బడ్జెట్లో రూ. 7,592 కోట్లను ప్రతిపాదించారు. ఇందులో కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల ధీమానిచ్చే ‘ఇందిరమ్మ జీవిత బీమా’ కోసం రూ. 4 వేల కోట్లు కేటాయించారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల కోసం పబ్లిక్ స్కూళ్లకు రూ. 500 కోట్లు, విద్యార్థుల బ్రేక్ఫాస్ట్కు రూ. 800 కోట్లు, ఇంటర్ మధ్యాహ్న భోజనానికి రూ. 100 కోట్లు అలొకేట్ చేశారు. అటు ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ప్రమాద బీమాకు కలిపి రూ. 1,056 కోట్లు, విదేశీ కొలువుల కోసం ‘సీఎం ఓవర్సీస్ ఎంప్లాయి మెంట్’కు రూ. 1,056 కోట్లు, ఏటీసీ ట్రైనీల స్కాలర్షిప్లకు రూ. 80 కోట్లు కేటాయించారు.
