మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. మేడారం కేబినెట్ నిర్ణయాలు ఇవే !

 మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. మేడారం కేబినెట్ నిర్ణయాలు ఇవే !

తొలిసారి హైదరాబాద్ వెలుపల, మేడారంలో నిర్వహించిన కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదివారం (జనవరి 18) జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి:

కేబినెట్ నిర్ణయాలు.. డీటెయిల్డ్గా:

1. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు: 

రాష్ట్రంలో పదవీ కాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరపాల్సి ఉంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. అందుకే ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని  కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగలు ఉన్నందున ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ రూపొందించుకోవాలని కేబినెట్ అధికారులకు సూచించింది. 


2. 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి పరివాహక ప్రాంతం అభివృద్ధి. బాసర నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు త్వరలో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది.

బాసర నుంచి భద్రాచలం వరకు ఒక సర్క్యూట్ ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని నిర్ణయం తీసుకుంది.  దేవాదాయ, రెవెన్యూ, అటవీ, పర్యాటక, పురాతత్వ శాఖల సంయుక్తంగా డీటేయిల్ రిపోర్ట్ తయారు చేయాలని అధికారులకు కేబినెట్ ఆదేశించింది. మార్చి 31 నాటికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని  సీఎం  ఆదేశించారు.

3. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-I ప్రాజెక్ట్ పై సమీక్ష:

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-I ప్రాజెక్ట్  ను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు సంబంధించి ఇంతవరకు జరిగిన పురోగతిని కేబినెట్ సమీక్షించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫేజ్-IIAలోని నాలుగు కారిడార్లు,  ఫేజ్-IIBలోని మూడు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్ లో ఉన్నాయి. ఈలోపు భూసేకరణ  ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూ.2,787 కోట్ల అంచనా వ్యయమయ్యే భూ సేకరణ ప్రతిపాదనలను  మంత్రివర్గం ఆమోదించింది.

4. నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీకి కొత్త పోస్టులు మంజూరు:

మహాత్మాగాంధీ యూనివర్సిటీ  లా కాలేజీలో 24 కొత్త పోస్టులు, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టులు మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ లో రిజిస్ట్రార్ పోస్టుకు ఆమోదం తెలిపింది.

5. అబ్దుల్లాపూర్ మండలంలో ఎకో టౌన్ డెవలప్మెంట్:

హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మండలంలో ఎకో టౌన్ డెవలప్మెంట్ కు TGIIC కి 494 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.

6. బంజారాహిల్స్ - శిల్పా లేఅవుట్ వరకు 9 కి.మీ. కొత్త రోడ్డు నిర్మాణం:

 హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు బంజారా హిల్స్ లోని ICCC నుంచి శిల్పా లే అవుట్ రోడ్డు వరకు కొత్తగా 9 కి.మీ. కొత్త రోడ్డు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

7. ములుగు జిల్లాలో పొట్లాపూర్  లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్:


 ములుగు జిల్లాలో కొత్తగా పొట్లాపూర్  లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కేబినెట్ ఆమోదించింది. రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ములుగు జిల్లాలోని 5 గ్రామాలు, 30 చెర్వులు కుంటలను నింపడంతో పాటు.. 7500 ఎకరాల ఆయకట్టు కు నీటిని అందించనుంది. రూ.143 కోట్ల అంచనా వ్యయంతో ఈ స్కీం చేపట్టనుంది.