కాసేపట్లో యశోద హాస్పిటల్కు రేవంత్.. కేసీఆర్ను పరామర్శించనున్న సీఎం

కాసేపట్లో యశోద హాస్పిటల్కు రేవంత్.. కేసీఆర్ను పరామర్శించనున్న సీఎం

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. మరికాసేపట్లో సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించనున్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి యశోద ఆస్పత్రి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. 

నిన్న (డిసెంబర్ 9న)  వైద్య, ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీని హాస్పిటల్ కు సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. మరోవైపు.. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. 

హిప్ రీప్లేస్ మెంట్ ఆపరేషన్ తర్వాత కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. శనివారం (డిసెంబర్ 9న) వాకర్ సాయంతో డాక్టర్ల పర్యవేక్షణలో కేసీఆర్ కాసేపు నడిచారు. హాస్పిటల్‌లోని తన రూమ్‌లో వాకర్‌‌తో కేసీఆర్ నడుస్తున్న 1.43 నిమిషాల నిడివి ఉన్న వీడియోను రిలీజ్ చేశారు. గురువారం (డిసెంబర్ 7న) రాత్రి ఎర్రవల్లిలోని తమ ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ జారిపడటంతో ఆయన్ను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు కుటుంబ సభ్యులు తరలించారు. 

సీటీ స్కాన్​ చేసిన డాక్టర్లు.. తుంటి ఎముక విరిగినట్టుగా గుర్తించారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత్రి హిప్ ​రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. శనివారం మధ్యాహ్నం డాక్టర్ ​ప్రవీణ్​రావు పర్యవేక్షణలో వాకర్ సాయంతో కేసీఆర్ నడిచారు. డాక్టర్లు వాకర్‌‌ను ముందుకు జరుపుతూ కేసీఆర్‌‌తో జాగ్రత్తగా అడుగులు వేయించారు. హిప్ ​రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసిన వారి శారీరక, మానసిక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ‘మొబిలైజేషన్ స్టార్ట్’ చేస్తారని, ఇందులో భాగంగానే కేసీఆర్‌‌ను నడిపించే ప్రయత్నం చేశామని డాక్టర్లు తెలిపారు.

హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని ప్రవీణ్​రావు చెప్పారు. కేసీఆర్ మానసికంగా బలంగా ఉన్నారని, ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేగంగా రికవర్ అవుతున్నారని తెలిపారు. బ్రీతింగ్ ఎక్సర్‌‌సైజ్‌లు చేయిస్తామని, ఆయన మెడికల్‌గా స్టేబుల్‌గా ఉన్నారని, నార్మల్​ఫుడ్​ తింటున్నారని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుందని, శరీరం ఇట్లాగే సహకరిస్తే రెండు, మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.