
- అందుకు తగ్గట్టుగా డీపీఆర్ రెడీ చేయండి: సీఎం
- రాయదుర్గం - ఎయిర్పోర్ట్ మెట్రో ప్రతిపాదన ఆపేయండి
- కొత్తగా ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీతోపాటు
- ఎల్బీనగర్ నుంచి కనెక్టివిటీ శ్రీశైలం హైవేపై ఎయిర్
- పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు కూడా
- జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి శామీర్ పేట్, కండ్లకోయ దాకా..
- రివ్యూలో అధికారులకు పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి
హైదరాబాద్, వెలుగు: మెట్రో రైలు రెండో దశ, మూడో దశ ప్రతిపాదనలపై డీపీఆర్, ట్రాఫిక్ స్టడీస్ త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా ఈ మెట్రో నిర్మాణం జరగాలని సూచించారు. కొత్త అలైన్ మెంట్ వల్ల తక్కువ దూరంతో అత్యధిక ప్రయాణ ప్రయోజనం జరిగేలా, నిర్మాణ వ్యయం తక్కువయ్యేలా చూడాలని చెప్పారు. ఆ మేరకే ప్రతిపాదనలు తయారు చేయాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రాయదుర్గం- – ఎయిర్పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్లో పెట్టాలని సీఎం ఆదేశించారు. దానికి బదులుగా ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీ నగర్ నుంచి కనెక్ట్ చేయాలని చెప్పారు. అదే విధంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలో మీటర్ల దూరాన్ని కూడా కలుపుతూ ప్రణాళిక రెడీ చేయాలన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ, మూడో దశ విస్తరణపై సీఎం రేవంత్ అధికారులతో మంగళవారం రివ్యూ చేశారు. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రెండో దశ ప్రతిపాదనలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిమాట్లాడుతూ.. అత్యధిక మంది ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా మెట్రో ప్రాజెక్టును తీర్చిదిద్దాలన్నారు. ప్రస్తుత మెట్రో కారిడార్లకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ చేపట్టి నగరం నలుదిశలా అభివృద్ధి జరిగేలా చేయాలని సూచించారు.
ఓల్డ్ సిటీ ప్రజాప్రతినిధులతో సంప్రదించే మెట్రోరైలు ముందుకు
దారుల్ షిఫా జంక్షన్ నుంచి షాలిబండ వరకు గల మెట్రో రైల్ స్ట్రెచ్ మార్గాన్ని, రోడ్డును వెడల్పు చేయాలంటూ హెచ్ఎంఆర్ఎల్ చేసిన ప్రతిపాదనలపై ఓల్డ్ సిటీ ప్రజా ప్రతినిధులతో సంప్రదించాలని, దారుల్ పిషా జంక్షన్ నుంచి ఫలక్ నుమా జంక్షన్ వరకు రహదారిని 100 ఫీట్ల వరకు విస్తరించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. దీనివల్ల ఓల్డ్ సిటీ ఇతర ప్రాంతాలతో సమానంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు. మెట్రోరైలు నిర్మాణ ప్రణాళికలో భాగంగా.. ఓల్డ్ సిటీలో వారసత్వ, మతపరమైన నిర్మాణాలు 103 ఉన్నట్లు తేలిందని, వీటికి నష్టం జరుగకుండా చూడాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో అవసరమైతే తానే స్వయంగా కలుగజేసుకుంటానని, ఓల్డ్ సిటీ ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుంటానని సీఎం చెప్పారు.
గత ప్రభుత్వ ప్లాన్ను నిలిపేయండి
గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు రూ.6,250 కోట్లతో నిర్మించతలపెట్టిన 31 కిలోమీటర్ల ఎయిర్ పోర్టు మెట్రో ప్లాన్ ను ప్రస్తుతానికి నిలిపివేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ మార్గంలో ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా వెడల్పయిన ఔటర్ రింగ్ రోడ్డు ఉందని చెప్పారు. ఈ మార్గానికి బదులుగా ఎయిర్ పోర్టుకు మెట్రోను ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీ తోపాటు ఎల్బీనగర్ నుంచి కూడా కనెక్ట్ చేయాలని సూచించారు. అదేవిధంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు గల 5 కిలోమీటర్ల మేర దూరాన్ని కూడా కలుపుతూ ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మార్చిన అలైన్ మెంట్ ప్రకారం ట్రాఫిక్ స్టడీస్, డీపీఆర్ త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష్మిగూడ-జల్ పల్లి –మామిడిపల్లి మార్గంలో కొత్తగా మెట్రో నిర్మాణం కోసం అవకాశాలను పరిశీలించాలని ఆయన సూచించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా రోడ్డు మధ్యలో 40 ఫీట్ల వెడల్పుతో నిర్మాణం చేసే ప్రణాళికను పరిశీలించాలని, దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని ఆయన అన్నారు. ఇదే మార్గంలో ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్ మెంట్ కోసం స్ట్రెచ్ వెంట అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని హెచ్ ఎండీఏ కమిషనర్ ఎం.దానకిషోర్ తో పాటు సీఎం ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రిని సీఎం రేవంత్ ఆదేశించారు. అలాగే ఓల్డ్ సిటీతోపాటు దాని చుట్టుపక్కల అభివృద్ధి చేయాలని అన్నారు.
ఓఆర్ఆర్ చుట్టూ గ్రోత్ హబ్
మెట్రో రైల్ విస్తరణలో భాగంగా 5 ప్రతిపాదిత రూట్లకు సంబంధించి ప్రణాళికలు త్వరగా సిద్ధం చేసి కేంద్ర అర్బన్ డెవలప్ మెంట్, హౌసింగ్ మినిస్టర్ హర్ దీప్ సింగ్ పూరికి డ్రాఫ్ట్ లెటర్ ను సిద్ధం చేసి పంపించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ముఖ్య కార్యదర్శితో పాటు మెట్రోరైలు ఎండీని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. 40 కిలోమేటర్ల మేర మూసి రివర్ ఫ్రంట్ ఈస్ట్- వెస్ట్ కారిడార్ ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని సూచించారు. తారామతి నుంచి నార్సంగి వయా నాగోల్ , వయా ఎంజీబీఎస్ వరకు చేపట్టాలని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర అవసరాలకు తీర్చడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, ఓఆర్ఆర్ చుట్టూ చిన్నాభిన్నమైన ప్రాంతాలను గ్రోత్ హబ్ గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. శ్రీశైలం హైవేపై ఎయిర్ పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రోరైలు కనెక్టివిటీని కూడా ప్లాన్ చేయాలని సూచించారు. ఇక్కడ ఫార్మాసిటీ కోసం భూములను ఈ ప్రాంతంలో సేకరించినట్లు తెలిపారు. అందువల్లే మెట్రో కనెక్టివిటి అవసరమని అన్నారు. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి శామీర్ పేట్ వరకు, కండ్లకోయ/ మేడ్చల్ దాకా మెట్రోరైలు మూడో దశ విస్తరణ జరగాలని సూచించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి షానవాజ్ ఖాసీం, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెట్రో విస్తరణపై 5 ప్రతిపాదనలు:
1 . మియాపూర్ – చందానగర్ – బీహెచ్ఈఎల్ – పటాన్ చెరు (14 కిలోమీటర్లు)
2. ఎంజీబీఎస్ – ఫలక్ నుమా – చాంద్రాయణగుట్ట– మైలాదేవర్ పల్లి–
పీ7 రోడ్డు– ఎయిర్ పోర్టు (23 కిలోమీటర్లు)
3. నాగోల్ – ఎల్బీనగర్– ఒవైసీ హాస్పిటల్– చాంద్రాయణ గుట్ట– మైలాదేవర్ పల్లి– ఆరాంఘర్– న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్రనగర్ (19 కిలోమీటర్లు)
4. కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు (విప్రో జంక్షన్ నుంచి/అమెరికన్ కాన్సులేట్) వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐఎస్ బీ రోడ్డు (12 కిలోమీటర్లు)
5. ఎల్బీనగర్–వనస్థలిపురం–
హయత్ నగర్(8 కిలోమీటర్లు)