
- డిప్యూటీ సీఎం ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన చర్యలు
- పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
- సదరన్ డిస్కం ఆఫీస్ ఎదుట కేబుల్ ఆపరేటర్ల ధర్నా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కరెంట్స్తంభాలపై ప్రాణాంతకంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియెట్లో ఆ శాఖఅధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మానవీయ కోణంలో ఆలోచించి, గత సంవత్సర కాలంగా కేబుల్ ఆపరేటర్లకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా వారు స్పందించకపోవడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, అధికారులు, సిబ్బంది విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్ల తొలగింపుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే అధికారులు వెంటనే కఠినంగా స్పందించి, వాటిని తొలగించాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్ తీసుకునేవారు విద్యుత్ శాఖ సిబ్బంది సహాయంతోనే ఏర్పాటు చేసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తుల ద్వారా చేస్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.
సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు స్పీడప్ చేయాలి..
హైదరాబాద్ మహానగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సంబంధించి కన్సల్టెంట్ సమర్పించిన డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పై సమావేశంలో చర్చించారు. సాగునీరు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వివిధ ఎత్తిపోతల పథకాల కింద విద్యుత్ సరఫరా, వినియోగంపై కూడా సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సీఎండీ హరీశ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారుఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.