టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్, తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రస్తుత ఇరాన్ సర్వోన్నత నాయకుడు మోజ్తాబా ఖమేనీ శపథం చేసిన విషయం తెలిసిందే. మోజ్తాబా ప్రకటన చేసిన కేవలం 48 గంటల వ్యవధిలోనే 13 మంది ప్రపంచ అగ్ర నేతల పేర్లతో ఇరాన్ తమ హిట్ లిస్ట్ను ప్రకటించింది. ఇరాన్ జాతీయ దినపత్రిక హమ్షహ్రీ విడుదల చేసిన ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చిత్రాలపై స్నైపర్ గురి పెట్టినట్లు చూపించారు.
వీరితో పాటు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, అమెరికా యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్, అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ బ్రాడ్ కూపర్, ఇజ్రాయెల్లో అమెరికా రాయబారి మైక్ హకబీ, ఇజ్రాయెల్ రక్షణ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయల్ జమీర్, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ల పేర్లు ఉన్నాయి.
►ALSO READ | చలి దేశం UKలో వడగాలుల బీభత్సం.. మే, జూన్ నెలల్లోనే 2,700 మందికి పైగా మృతి!
ఇజ్రాయెల్, అమెరికా తమపై దాడులు చేశాయి కాబట్టి ఆ దేశ అగ్ర నేతలపై ఇరాన్కు కోపం ఉండటం కామన్. కానీ ఈ హిట్ లిస్ట్లో ఇటలీ, ఇంగ్లాండ్, జర్మనీ అగ్రనేతల పేర్లు ఉండటం కొత్త చర్చకు దారి తీసింది. దీనికి ఇరాన్ ఏం చెబుతుందంటే.. యుద్ధ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఖండించకపోవడం, తమ గగనతలాన్ని అమెరికా సైనిక విమానాలకు ఉపయోగించుకోవడానికి అనుమతించడంతోనే వీరి పేర్లను ప్రతీకార జాబితాలో చేర్చామంటుంది.
అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ 13 ప్రపంచ అగ్రనేతల పేర్లతో హిట్ లిస్ట్ రిలీజ్ చేయడం తీవ్ర ప్రపంచ దేశాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
