- ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని మండల స్థాయికి కూడా తీసుకొచ్చింది. ఇప్పటివరకు రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో మాత్రమే కొనసాగుతున్న ప్రజావాణి ఇక నుంచి ప్రతి మండల కేంద్రంలోనూ జరగనుంది. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజలు చిన్న చిన్న సమస్యల కోసం జిల్లా కేంద్రాలు లేదా హైదరాబాద్లోని ప్రజాభవన్కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. తమ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోనే అధికారులకు నేరుగా దరఖాస్తులు ఇవ్వొచ్చు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీవో ఆఫీసుల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు.
మండల స్థాయి ప్రజావాణికి ఎంపీడీవో నోడల్ అధికారిగా ఉంటారు. మండల స్థాయి ప్రజావాణిలో ప్రజల సమస్యలకు సంబంధించిన దాదాపు 23 శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొంటారు. ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవోతో పాటు వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, విద్యుత్, మున్సిపల్, ఐసీడీఎస్, సంక్షేమ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు తీసుకుంటారు.
ఆన్లైన్లో నమోదు.. డిజిటల్ రసీదు..
ప్రజావాణి కేంద్రాల్లో కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ సదుపాయాలతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ప్రజల నుంచి తీసుకున్న ప్రతి దరఖాస్తును వెంటనే ప్రజావాణి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి, అర్జీదారులకు డిజిటల్ రసీదు ఇస్తారు. దరఖాస్తుల పరిష్కారంపై పైస్థాయి అధికారులు కూడా ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
ప్రతి ప్రజావాణి కేంద్రంలో తాగునీరు, కూర్చునే సదుపాయం, దివ్యాంగులకు వీల్చైర్లు, హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకుస్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
