1796 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ముందుకు వచ్చిన రైతులు

1796 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ముందుకు వచ్చిన రైతులు
  • బ్యాంకు లోన్లతో విద్యుత్​ రంగంలోకి అడుగు
  • ప్రభుత్వంపై రూ.6 వేల కోట్ల భారం తగ్గింపు
  • పీఎం కుసుమ్​ స్కీమ్​తో పైసా ఖర్చు లేకుండా 
  • 1,796 మెగావాట్ల సోలార్​ విద్యుత్​ ప్లాంట్ల ఏర్పాటు
  • సిరిసిల్లలో 6 మెగావాట్ల జనరేషన్  ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతులు 1,796 మెగావాట్ల సోలార్​ పవర్​ ఉత్పత్తి చేయడానికి ముందుకొచ్చారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.6 వేల కోట్ల భారం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్​ స్కీమ్ ను గత బీఆర్ఎస్​ సర్కారు పక్కకు పెట్టింది. 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్ల పాటు ఈ స్కీమ్​ విధివిధానాలేంటో కనీసం ఒక్క రైతుకు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. అదే స్కీమ్​ను ఇప్పుడు రైతన్నలు తమకు వరంగా మార్చుకున్నారు. బ్యాంకర్ల సహాయంతో తమ వ్యవసాయ భూముల్లో పంటలకు బదులు కరెంట్​ పండిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకోకుండా రూ.వేల కోట్ల పెట్టుబడితో రైతన్నలే రాష్ట్రంలో 1,796 మెగావాట్ల సోలార్​ విద్యుత్​  ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నారు. చాలా చోట్ల పనులు మొదలయ్యాయి. సిరిసిల్లలో ఇప్పటికే 6 మెగావాట్ల సోలార్​ పవర్​ జనరేషన్​ స్టార్ట్​ చేశారు. మరో ఐదారు నెలల్లో ఈ స్కీమ్​లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానానికి చేరుకోబోతున్నది. పెరుగుతున్న విద్యుత్​ డిమాండ్ల దృష్ట్యా ఇదే స్థాయిలో ప్రభుత్వం పవర్​ జనరేషన్​ చేయాలంటే కనీసం రూ.9 వేల కోట్ల పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. టీజీ రెడ్​కో ఆఫీసర్ల పట్టుదల, ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పీఎం కుసుమ్​ ప్రాజెక్టు​ పట్టాలెక్కడంతో ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది.

విద్యుత్​ ఉత్పత్తి తక్కువ.. కొనేది ఎక్కువ

రాష్ట్రంలో విద్యుత్​ డిమాండ్  రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఒక రోజుకు పీక్​ డిమాండ్​ 17 వేల మెగావాట్లకు దాటిపోయింది. 2028 నాటికి 20 వేల మెగావాట్లు మించిపోతుందని ప్రభుత్వం అంచనావేస్తోంది. అయితే రాష్ట్రంలో విద్యుత్​ ఉత్పత్తి విషయానికి వస్తే, సగం కూడా ప్రభుత్వం ఉత్పత్తి చేయలేకపోతుంది. రోజుకు 50 శాతానికి పైగా కరెంట్​ను బయట నుంచే కొంటున్నది. దీంతో డిస్కమ్​లపై భారం పడుతోంది. వ్యవసాయానికి, గృహలక్ష్మికి ఉచిత కరెంట్​ సరఫరా వల్ల ఏటా బకాయిలు పెరిగిపోతున్నాయి. గత బీఆర్ఎస్​ సర్కారు  నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి థర్మల్  పవర్  స్టేషన్  (వైటీపీఎస్) ని ఏర్పాటు చేయడానికి రూ.29 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టు​పూర్తయ్యే సరికి మరో ఐదారువేల కోట్ల పెట్టుబడులు పెరిగాయి. ఈ లెక్కల ఒక మెగావాట్​ థర్మల్​ విద్యుత్​ ఉత్పత్తికి గత సర్కారు రూ.7 కోట్ల నుంచి 8 కోట్లకు పైగా ఖర్చు చేసింది. 

పోర్టల్​ రెడీ చేస్తున్న రెడ్​కో ఆఫీసర్లు

రాష్ట్రంలో పీఎం కుసుమ్​ స్కీమ్​లో భాగంగా రైతులు ఉత్పత్తి చేసే పవర్​ను లెక్కించడానికి టీజీ రెడ్​కో ఆఫీసర్లు పోర్టల్​ రెడీ చేస్తున్నారు. రోజులు, నెలలే కాకుండా గంటలు, నిమిషాల లెక్కన పవర్​ జనరేషన్​ వివరాలు తెలుసుకోవడానికి ‘సోలార్​ ఎనర్జీ డేటా మేనేజ్​మెంట్​ పోర్టల్​’ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. రైతులు తమ వ్యవసాయ భూముల వద్ద ట్రాన్స్​ఫార్మర్లను ఏర్పాటు చేసుకొని వీటి ద్వారా ఉత్పత్తి అయిన కరెంట్ ను సబ్​ స్టేషన్​కు సరఫరా చేస్తారు. దీనికోసం రిమోట్​ మానిటరింగ్​ సిస్టమ్​(ఆర్ఎంఎస్​) పనిచేస్తుంది.  

ఐదారు నెలల్లో పనులు పూర్తి చేస్తం

పీఎం కుసుమ్​ స్కీమ్​లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,156 మంది రైతులు 1,796.3 మెగావాట్ల సోలార్​ ప్లాంట్ల నిర్మాణ పనులను మొదలుపెట్టారు. మరో ఐదారు నెలల్లో పనులన్నీ పూర్తయితే, దేశంలోనే రాష్ట్రం సోలార్  పవర్  ఉత్పత్తిలో నంబర్​వన్​గా నిలుస్తుంది. రాష్ట్రంలో ఈ స్కీమ్​ ఆలస్యంగా ప్రారంభమైనా ప్రభుత్వం, బ్యాంకర్ల సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. – అనిలా, వైస్​ చైర్మన్​ అండ్​ ఎండీ, టీజీ రెడ్​కో, హైదరాబాద్​

రూ.3.25 కోట్లకే ఒక మెగావాట్​ సోలార్​ పవర్​

పీఎం కుసుమ్​ స్కీమ్​లో ఒక మెగావాట్​ విద్యుత్​ ఉత్పత్తికి సుమారు రూ.3.25 కోట్లు మాత్రమే ఖర్చు అవుతున్నది. ఇందులో 70 నుంచి 85 శాతం బ్యాంకులు రుణాలుగా అందిస్తున్నాయి. మిగతావి రైతులే పెట్టుబడిగా పెట్టి విద్యుత్​ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,156 మంది రైతులు 1,796.3 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి చేయడానికి డిస్కమ్​లతో పవర్​ పర్చేస్​ అగ్రిమెంట్లు (పీపీఏ) లు చేసుకున్నారు. ఇందులో ఎన్పీడీసీఎల్​ పరిధిలో 436 మంది రైతులు 631.9, ఎస్పీడీసీఎల్​ పరిధిలో 720 మంది రైతులు 1,164.4 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి ప్లాంట్ల పనులను మొదలు పెట్టారు.

మొత్తం 33 సర్కిళ్ల పరిధిలో పనులు మొదలయ్యాయి. ఎస్​బీఐ, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, బరోడా, యూనియన్​ బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతన్నలు సోలార్​ పవర్​ ప్లాంట్ల పనులు మొదలుపెట్టారు. సిరిసిల్లలో ఇప్పటికే ముగ్గురు రైతులకు పనులను కంప్లీట్​ చేసి 6 మెగావాట్ల పవర్​ జనరేషన్​ స్టార్ట్​ చేశారు. లోకల్​గా ఉన్న విద్యుత్​ సబ్​ స్టేషన్​కు సోలార్​ పవర్​ను అందిస్తున్నారు. థర్మల్​ విద్యుత్​ ఉత్పత్తితో పోలిస్తే ఒక మెగావాట్​పై రూ.5 కోట్లకు పైగా ఖర్చు సేవ్​ అవుతున్నది. ఈ లెక్కను ప్రభుత్వం మోయాల్సిన రూ.6 వేల కోట్ల భారం తగ్గినట్లు అయ్యింది.