హైద‌రాబాద్‌లో ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ప్ర‌త్యేక ఆస్ప‌త్రులు: దేశంలోనే తొలిసారి

హైద‌రాబాద్‌లో ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ప్ర‌త్యేక ఆస్ప‌త్రులు: దేశంలోనే తొలిసారి

దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండ‌ర్ల కోసం ప్ర‌త్యేకంగా రెండు ఆస్ప‌త్రులు అందుబాటులోకి వ‌చ్చాయి. వీటిని హైద‌రాబాద్ సిటీలోనే ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌జెండ‌ర్ల హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ట్రాన్స్‌జెండ‌ర్ ప‌ర్స‌న్స్ యాక్ట్ - 2019 అమ‌లులో భాగంగా తొలుత‌ దేశ‌వ్యాప్తంగా ప‌లు మెట్రో సిటీల్లో ప‌త్యేక ఆస్ప‌త్రుల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా తొలి రెండుట్రాన్స్ క్లినిక్‌ల‌ను హైద‌రాబాద్ సిటీకి కేటాయించింది. వాటిలో ఒక‌టి నారాయ‌ణ‌గూడ‌లో ఈ ఏడాది జ‌న‌వ‌రి 29న‌, రెండోది జీడిమెట్ల‌లో జులై 11న ప్రారంభ‌మ‌య్యాయి. జీడిమెట్లలోని క్లినిక్‌ను ఫేమ‌స్ డ్రాగ్ ఆర్టిస్ట్ సుశాంత్ దివ్‌గిక‌ర్ ప్రారంభించారు. ఈ క్లినిక్‌లలో సేవ‌లందించే వారు కూడా ట్రాన్స్‌జెండ‌ర్లే కావ‌డం విశేషం. ఇక్క‌డ హిజ్రాలు, ట్రాన్స్‌మెన్, క్రాస్‌డ్ర‌సెర్లు, జెండ‌ర్ నాన్ కన్ఫామింగ్ పీపుల్, జోగినులు, శివ శ‌క్తులు స‌హా ట్రాన్స్ క‌మ్యూనిటీ కింద‌కు వచ్చే వాళ్లంద‌రికీ వైద్య సేవ‌లు అందుతాయి. సాధార‌ణ వైద్య సేవ‌లతో పాటు హార్మోన్ థెర‌పీ, గైడెన్స్, మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు కౌన్సెలింగ్, హెచ్ఐవీ, సెక్సువ‌ల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్ష‌న్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, వ‌చ్చాక అవ‌స‌ర‌మ్యే ట్రీట్‌మెంట్స్, లీగ‌ల్ స‌మ‌స్య‌ల‌కు సాయం, సామాజికంగా ఎదురయ్యే స‌మ‌స్య‌ల‌కు ర‌క్ష‌ణ కూడా ఇక్క‌డ దొరుకుతుంది.

ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు తెలియ‌జేస్తూ ఇన్‌స్టా పోస్ట్

ఈ ట్రాన్స్ క్లినిక్‌లు అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ చాలా మందికి వీటి గురించి ఇప్ప‌టికీ అవ‌గాహ‌న లేదు. దీంతో జీడిమెట్ల క్లినిక్‌ను ప్రారంభించిన సుశాంత్ దివ్‌గిక‌ర్ స్పందించి త‌న ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా అవ‌గాహ‌న క‌ల్పిస్తూ జులై 28న‌ పోస్ట్ చేశారు. గుడ్‌న్యూస్ అంటూ ఈ విష‌యాన్ని వివ‌రించారు. ఈ క్లినిక్‌ల‌లో ప‌ని చేసేవాళ్లంతా ట్రాన్స్‌జెండ‌ర్లేన‌ని, తాము కూడా డాక్ట‌ర్లు, న‌ర్సులు, మెడిక‌ల్ ఎగ్జామిన‌ర్లు, రిసోర్స్ స్టాఫ్‌, మేనేజింగ్ స్టాఫ్‌, కౌన్సిల‌ర్లు, సైక్రియాట్రిస్టులుగా ఎదిగి, వ‌ర్క్ చేయ‌గ‌ల‌మ‌ని దీని ద్వారా రుజువైంద‌ని పేర్కొన్నారు. ఇది తాము గ‌ర్వించాల్సిన స‌మ‌య‌మ‌ని, తాము కూడా అందిలా ఏదైనా సాధించ‌గ‌ల‌మ‌ని కావాల్సింద‌ల్లా స‌మాన‌త్వం, అవ‌కాశాలేన‌ని చెప్పారు.

హైద‌రాబాద్‌లోనే మొద‌ట‌గా ఈ ట్రాన్స్ క్లినిక్‌లు ఏర్పాటు చేయ‌డంపై  ట్రాన్స్‌జెండ‌ర్ యాక్టివిస్ట్ ర‌చ‌నా ముద్ర‌బోయిన మీడియాతో మాట్లాడారు. హైద‌రాబాద్ సిటీలో ట్రాన్స్‌జెండ‌ర్ల‌లో ఎక్కువ మందికి హెచ్ఐవీ ఉండ‌డం వ‌ల్లే దేశంలోనే మొద‌ట ట్రాన్స్ క్లినిక్‌ల‌ను ఇక్క‌డ ఏర్పాటు చేసి ఉండొచ్చ‌ని ర‌చ‌న‌ అన్నారు. "దేశ‌వ్యాప్తంగా ట్రాన్స్‌జెండ‌ర్ల‌లో స‌గ‌టును 3.13 శాతం మందికి హెచ్ఐవీ ఉంటే, హైద‌రాబాద్‌లో ఇది 6.47 శాతం ఉంది, 2030 క‌ల్లా ఎయిడ్స్‌ను నిర్మూలించేందుకు మ‌న దేశం.. నేష‌న‌ల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ (నాకో), అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ (యూఎస్ఎయిడ్) సంస్థ‌తో క‌లిసి ప‌ని చేస్తోంది. ఈ ప్ర‌య‌త్నంలో భాగంగా  నాకో సంస్థ‌కు యూఎస్ ఎయిడ్ టెక్నిక‌ల్ సాయం అందిస్తోంది. ట్రాన్స్‌జెండ‌ర్ల‌లో హెచ్ఐవీని నిరోధించ‌డం, వారికి యాంటీ రిట్ర‌రైవ‌ల్ థెర‌పీ లాంటివి అందించ‌డం వంటి యూఎస్ఎయిడ్ ల‌క్ష్యాల‌కు ఈ ట్రాన్స్‌జెండ‌ర్ క‌మ్యూనిటీ క్లినిక్స్ చాలా బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే ట్రాన్స్‌జెండ‌ర్ల ఆరోగ్యాన్ని కాప‌డ‌డంతో పాటు వారి సామాజిక ఆర్థిక స్థితిగ‌తుల‌ను మెరుగుప‌రిచేందుకు ఈ చ‌ర్య ఉప‌క‌రిస్తుంది" అని ర‌చ‌న చెప్పారు.