స్కూల్స్, కాలేజీల దగ్గర ఉన్న లిక్కర్ షాపులు మూసేయండి: హైకోర్ట్ సీరియస్ ఆర్డర్స్

స్కూల్స్, కాలేజీల దగ్గర ఉన్న లిక్కర్ షాపులు మూసేయండి: హైకోర్ట్ సీరియస్ ఆర్డర్స్

చెన్నై: స్కూల్స్, కాలేజీలకు అతి సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, ఔషధ ప్రయోజనాల కోసం తప్ప మత్తు పానీయాలను నిషేధించడానికి ప్రయత్నించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 47ను ఈ సందర్భంగా న్యాయస్థానం గుర్తు చేసింది. కాగా, దిండిగల్ పట్టణంలోని తిరుచ్చి రోడ్డులో ఉన్న ప్రభుత్వ యాజమాన్యంలోని మద్యం దుకాణం మూసి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని పి. వెట్రివెల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మద్యం దుకాణం ఆ ప్రాంతం గుండా పాఠశాలకు వెళ్లే పిల్లలకు ఇబ్బంది కలిగిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‎పై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సోమవారం (జూన్ 7) విచారణ చేపట్టింది. మద్యం దుకాణం పాఠశాలకు కేవలం 30 మీటర్ల దూరంలో ఉందని పిటిషనర్ వాదించగా.. టాస్మాక్ అవుట్‌లెట్ కార్పొరేషన్ పరిమితుల్లోకి వస్తుందని, ఇక్కడ కనీస అవసరమైన దూరం 50 మీటర్లు అని ప్రభుత్వం వాదించింది. వాణిజ్య ప్రాంతంలో నిర్దేశించిన దూర పరిమితులు వర్తించవని ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికెళ్లింది. 

ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన న్యాయస్థానం.. మద్యం ఉండటం వల్ల ప్రజలకు, ముఖ్యంగా పాఠశాల సమయంలో పిల్లలకు అసౌకర్యం, ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది. దిండిగల్ పట్టణంలో పాఠశాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని వెంటనే మూసేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఒక వైపు ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించి.. మరోవైపు మద్యం దుకాణాలను నిర్వహించడం విరుద్ధం. ఇది రాజ్యాంగ నీతికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. 

ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, ఔషధ ప్రయోజనాల కోసం తప్ప మత్తు పానీయాలను నిషేధించడానికి ప్రయత్నించడం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశమని రాజ్యాంగంలోని ఆర్టికల్ 47ను ధర్మాసనం ప్రస్తావించింది. ప్రజారోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే టాస్మాక్ మద్యం దుకాణాల నిషేధాన్ని అమలు చేయడానికి కృషి చేయాలని చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ప్రజారోగ్యానికి హానిని కల్గించే మద్యం పానంపై దశలవారీగా నిషేధాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను తీసుకోవాలని కోరింది.