
తెలంగాణ రాష్ట్రావతరణ పదకొండేళ్ల పండుగ ముంగిట్లో కల్వకుంట్ల కవిత రేపిన దుమారం ఉద్యమ పార్టీలో చిచ్చు రగిల్చింది. ఇతర పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె వేసే ప్రశ్నలు, లేవనెత్తే సందేహాలకు బీఆర్ఎస్ పార్టీలో సమాధానం చెప్పేవాళ్లే కరువయ్యారు. సోదరుడైన పార్టీ కార్యనిర్వాహక అధక్షుడు కేటీఆర్ మీద ప్రత్యక్ష దాడికే దిగారు. మరో ముఖ్య నాయకుడైన బావ హరీష్రావు వ్యవహారశైలినీ తప్పుబట్టి మాట్లాడారు.
తండ్రి కేసీఆర్ని ప్రశంసిస్తూనే.. ఆయన నాయకత్వాన్ని ఇరుకున బెట్టే అంశాలు లేవనెత్తారు. బీఆర్ఎస్ను బీజేపీకి తాకట్టు పెట్టే ప్రతిపాదన తెస్తే జైలు నుంచి తానే వద్దన్నా అని ఓ సత్యాన్ని తెరపైకి తెచ్చారు. వెంటనే ‘తెలంగాణ జాగృతి’ని విస్తరించి, బీఆర్ఎస్ విఫలమవుతున్న ప్రజాఎజెండా చేపట్టే ఉద్దేశాన్ని ప్రకటించారు. తానెక్కడికీ పోయేది లేదని, బీఆర్ఎస్ లోనే ఉండి ‘లక్ష్యసాధన’కు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కార్యాచరణకు సన్నాహాలు మొదలెట్టారు.
కవిత లేవనెత్తిన కొన్ని అంశాలు బీఆర్ఎస్ లోపల-, బయట దుమారం రేపాయి. సామాజిక తెలంగాణ రానేలేదనడం నుంచి కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు చేరి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాయనడం వరకూ వెళ్లింది. ఆ మాటలు ఒకరకంగా ధిక్కారస్వరమంటున్న పార్టీ వర్గాలు, ఆమె తన తండ్రికి రాసిన లేఖను బహిర్గతం చేశాయి. లేఖను లీక్ చేయడమైనా, తనపై నిందలైనా, ప్రధాన మీడియాలో తప్పుడు రాతలైనా పార్టీకి, కుటుంబానికి తనను దూరం చేసే కుట్ర అని మీడియాతో మాట్లాడుతూ కవిత ధ్వజమెత్తారు.
కవిత చేసిన విమర్శను విలేకరులు ప్రస్తావించినపుడు, పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోవర్టులు ఉన్నారంటూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్య ఈ అగ్గిని మరింత రాజేసింది. అన్నాచెల్లెళ్ల మధ్య ‘షాడో బాక్సింగ్’ గడప దాటి బయటకు వచ్చింది. ‘పార్టీలో కోవర్టులుంటే, వారెవరో గుర్తించి, ఏరి పారేయక ఏం చేస్తున్నారు’అని కవిత ప్రశ్నించడం తాజా పరిణామం. విలేకరులతో ఆమె జరిపిన ముచ్చట్లను విశ్లేషిస్తే ప్రధానంగా కేటీఆర్ను, కొంతమేర హరీష్రావును, కుటుంబంలోని మరో సభ్యుడిని గురి చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ‘తెలంగాణ జాగృతి వేదికగా నేనైనా స్వీయ ఆచరణతో ఉద్యమానికి, పార్టీకి దోహదపడే కృషి చేశాను, కేసీఆర్ ఛత్రచ్ఛాయలో తప్ప వారు చేసిందేముంది?’ అని ప్రశ్నించడం, వారిపై ఆమెలో దృఢపడిన భావాలకు సంకేతం!
కేసీఆర్ కేంద్రంగానే పోరు మొదలు
‘ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కే కాళేశ్వరం కేసులో నోటీసులు పంపితే పార్టీ స్పందించే తీరు ఇదా? ట్వీట్లతో సరిపెట్టడమే తప్ప క్షేత్రస్థాయిలో ఉద్యమించరా?’ అంటూ కవిత గొంతెత్తారు. కేసీఆర్ తప్ప వేరొకరి నాయకత్వంలో తాను పని చేసేది లేదని కరాఖండిగా చెప్పిన ఆమె, ఆయనకే నోటీసులిస్తే లక్ష్యపెట్టరా అనే ఘాటైన విమర్శ ద్వారా ద్వితీయశ్రేణి నాయకుల్ని ఒక మూలకు నెట్టగలిగారు. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్త నిరసన, ఆందోళనకు జాగృతి ద్వారా పిలుపునిచ్చి, నగరంలోని ధర్నాచౌక్ నుంచో, అమరవీరుల స్తూపం నుంచో జూన్ తొలివారంలోనే నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆమె సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇపుడే పార్టీ పెట్టక పోవచ్చు
రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు ఆమె వెంటనే కొత్త పార్టీ పెట్టడమో, కాంగ్రెస్ పార్టీలో చేరడమో చేయకపోవచ్చు. పార్టీలో ఉంటూనే, జాగృతి వేదిక నుంచి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపైన, తెలంగాణ అస్తిత్వ అనుకూల అంశాలపైన కార్యాచరణ పెంచే ఆలోచనతో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయినపుడు పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆరే వద్దన్నారని, ‘నన్నేమీ చేయలేక నీ మీద తప్పుడు కేసు బనాయించారు, దీనికి రాజీనామా ఎందుకు? అక్కర్లేదు’ అని ఆయన అంటేనే మానేశాను తప్ప తనకు పదవీ వ్యామోహమేమీ లేదని ఓ వివరణ ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినపుడు, పార్టీ వారే సరిగా పనిచేయక ఓడించిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న కేసీఆర్ తన హోదా తగ్గొద్దని, ప్రొటోకాల్ కోసం ఎమ్మెల్సీ ఇచ్చారని గుర్తు చేశారు.
ప్రత్యక్ష, పరోక్ష దాడి
‘ఒకప్పుడు పార్టీ ముఖ్య నాయకుడి చంకలో వెలిగిన పెట్టుబడిదారులు ఇప్పుడెక్కడున్నారు? సీఎం రేవంత్ రెడ్డి పంచన చేరారు, మరి మా జాగృతి నుంచి అలా ఎవరూ వెళ్లలేదే!’ అంటూ పేర్లు వెల్లడించకుండానే అన్న కేటీఆర్ పై కవిత విమర్శలు సంధించారు. ఆమె సంధించిన ప్రధాన అస్త్రశస్త్రాల లక్ష్యం.. కేటీఆర్ అనే కనిపించింది.
బీఆర్ఎస్లో పుట్టిన ఈ చిచ్చులో ‘సోషల్ మీడియా’ వేదికదీ ఉత్ప్రేరక పాత్రే అంటే ఆశ్చర్యం లేదు. దాదాపు నెల రోజులుగా ఇంటా బయటా నాపై దుష్ప్రచారం జరుగుతుంటే, సోషల్ మీడియాలో, ఓ ప్రధాన పత్రికలో ఫేక్ న్యూస్ స్వైర విహారం చేస్తే పార్టీ ఎందుకు ఖండించలేదు? అనే ప్రశ్న అయినా, కేసీఆర్కు నోటీసివ్వడంపై ట్వీట్ చేస్తే సరా? క్షేత్రంలో ఉద్యమించరా అనడమైనా, అమెరికా, కెన్యా నుంచి సోషల్ మీడియా పోస్ట్లు ఆపరేట్ చేస్తున్నారనే నిర్దిష్ట విమర్శ అయినా ఆమె ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారో ఇట్టే బోధపడుతోంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు, ఇప్పుడూ కేటీఆర్ కి సన్నిహితంగా ఉండి, ఆయన ఆన్లైన్ వేదికల నిర్వహణలో కీలకపాత్ర వహించిన నిపుణుడిపైనా ఆమె గురిపెట్టారు. తాజా పరిణామాలపై ఎక్స్ ద్వారా ఆయన కూడా స్పందించడమే ఇందుకు నిదర్శనం. బీఆర్ఎస్కి ఇప్పుడు సత్వరం కావాల్సింది పోరాట పటిమ అని ఆమె విమర్శ కూడా కేటీఆర్ పనితీరుపై ప్రత్యక్ష దాడే! ఇటువంటి అంశాలను అంతర్గత ఫోరమ్స్లో మాట్లాడాలనే కొందరు పార్టీ నాయకుల సూచనను ప్రస్తావిస్తూ, ‘ఎక్కడుంది, అటువంటి ఫోరమ్?’ అని సంధించిన ప్రశ్న కూడా నాయకత్వ పనితీరును నిలదీయడమే!
ఏపీ రాజకీయాలతో పోలుస్తూ, ఇక్కడ కవిత మరో షర్మిల కానుందా? అనే సందేహం కూడా పార్టీవర్గాల్లో వ్యక్తమౌతోంది. కుటుంబ కలతల కారణంగా అన్నపై వై.ఎస్.షర్మిల విమర్శలు ఎక్కుపెట్టడం ద్వారా.. సోదరుడు ఏపీ మాజీ సీఎం వై.ఎస్.జగన్కు కలిగించిన నష్టం జగమెరిగిందే! ఇది, కేటీఆర్ కి తెలియకుండా ఉంటుందా? అనే వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తాయి.
కవ్వింపులు
కవిత ఒక విలేకరుల సమావేశానికి హరీశ్రావు, మరో విలేకరుల సమావేశానికి కేటీఆర్ స్పందించిన తీరు ‘గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు సర్దుకున్న’చందంగా ఉందని పార్టీలోని వారే మాట్లాడుకుంటున్నారు. ఆమెను తరచూ కవ్విస్తున్నారు. పార్టీలో పట్టు పెంచుకోవడానికి, తండ్రి దగ్గర ఎక్కువ ప్రాపకం సంపాదించడానికి ఇవన్నీ కవిత ఒత్తిడి రాజకీయాలు అని విమర్శిస్తున్నవారూ ఉన్నారు.
తన వద్దకు వచ్చిన కేసీఆర్ దూతలు ప్రస్తావించని అంశాలు ప్రస్తావించినట్టు మీడియాలో రాయించుకుంటున్నారని కవిత చేసిన నిర్దిష్ట విమర్శ ద్వారా దూతలు వచ్చారనే నిజం వెల్లడయింది. ఇంకా ఎన్ని నిజాలు వెల్లడి కావాల్సి ఉందో? కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి చక్కదిద్దేవరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయా? చిన్నగా మొదలైన గాలివాన తుఫాన్గా మారుతుందా? తుస్సుమంటుందా? కాలమే నిర్ణయించాలి.
విలీన చర్చ ఆ స్థాయిలో జరిగిందా?
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి తీహార్ జైలులో కవిత ఉన్నపుడు కేటీఆర్, హరీష్రావులు తరచూ ఆమెను కలిసేవారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన వస్తే తానే వద్దన్నా అని కవిత వెల్లడించారు. కేంద్రం తప్పుడు కేసుపెట్టి తనను అరెస్టు చేసి వేధిస్తున్నందునే రాజీపడి ఇటువంటి చర్యకు పాల్పడుతున్నారనే అపఖ్యాతి తన వల్ల వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరించి ఉండవచ్చు.
విలీన ప్రతిపాదన ఆలోచననే కేసీఆర్ వ్యతిరేకించినట్టు పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. అంటే, కేసీఆర్ను ఒప్పించడానికి కవిత మద్దతు కూడా కూడగట్టినట్టు ఉండాలనే భావనతో ద్వితీయ శ్రేణి నాయకత్వమే ఈ ప్రతిపాదన తెచ్చిందా? విలీన స్థాయి వరకూ చర్చలు వెళ్లాయా? ఆ రహస్యాలను కూడా కవిత ఇప్పుడు బహిరంగపరచి ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ఎండగట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ల విమర్శను ఒక రకంగా ఇది నిజం చేసినట్టయింది. దీన్ని పార్టీ శ్రేణులు ఎలా పరిగణిస్తాయన్నది వేచి చూడాలి.
-దిలీప్ రెడ్డి,పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్-