హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్లో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను యూనియన్ నాయకులు కలిశారు. రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, యాప్ ఆధారిత రవాణా రంగానికి సంబంధించిన పలు సమస్యలను మంత్రికి వివరించారు.
మంత్రి పొన్నం స్పందిస్తూ.. గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో ఛార్జీల పెంపుపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
