
హైదరాబాద్: కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే ఉత్కంఠకు తెరపడింది. జూన్ 8న మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన ముగ్గురికి బుధవారం (జూన్ 11) రాత్రి ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఒక్కొ మంత్రికి రెండు శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక,మైనింగ్, ఉపాధిశాఖలు.. వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, స్పోర్ట్స్, కల్చర్ .. అడ్లూరి లక్ష్మణ్కుఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ కేటాయించారు.
బుధవారం (జూన్ 11) రాత్రి సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు భేటీ అయ్యి మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించారు. ఈ భేటీ అనంతరం కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి కేబినెట్లోని కొందరు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు జరుగుతాయని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి జరగలేదు. కేవలం ఇటీవల కొత్తగా ఎంపికైన ముగ్గురు మంత్రులకు మాత్రమే శాఖలు కేటాయింపు జరిగింది.
మొత్తం 18 బెర్తుల్లో..
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 19 నెలల తర్వాత కేబినెట్ను విస్తరించారు. 2023 డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేబినెట్లో సీఎం సహా 18 మందికి అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా ముగ్గురు కేబినెట్లో చేరడంతో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మరో 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.