మంత్రులకు జిల్లా ఇన్‎చార్జ్ బాధ్యతలు.. మెదక్ జిల్లా ఇంచార్జ్‎గా మంత్రి వివేక్

మంత్రులకు జిల్లా ఇన్‎చార్జ్ బాధ్యతలు.. మెదక్ జిల్లా ఇంచార్జ్‎గా మంత్రి వివేక్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేబినెట్ విస్తరించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా మంత్రులకు జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు కేటాయించారు. కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన ముగ్గురికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడంతో పాటు కొందరు పాత మంత్రుల జిల్లాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఈ మేరకు గురువారం (జూన్ 12) సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే అమాత్య బాధ్యతలు స్వీకరించిన మంత్రి గడ్డం వివేక్‎ను మెదక్ జిల్లా ఇంచార్జ్‎గా నియమించారు. 

దామోదర రాజనర్సింహా మహబూబ్ నగర్, శ్రీధర్ బాబు రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్, సీతక్క నిజామాబాద్, జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్, తుమ్మల నాగేశ్వర్ రావు కరీంనగర్, వాకిటి శ్రీహరి ఖమ్మం, అడ్లూరి లక్ష్మణ్‎కు నల్గొండ జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. గతంలో సీతక్క ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్‎గా ఉండగా.. ఆమెను ఇప్పుడు నిజామాబాద్‎కు మార్చారు. 

నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ ఇంచార్జ్ అపాయింట్ చేశారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దగ్గర ఉన్న ఖమ్మం జిల్లా ఇంచార్జ్ బాధ్యతలను ఇటీవల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వాకిటి శ్రీహరికి కేటాయించారు. నల్లగొండ జిల్లా ఇంచార్జ్‎గా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావును కరీంనగర్‎కు ట్రాన్స్‎ఫర్ చేసి.. నల్లగొండ జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు అడ్లూరి లక్ష్మణ్‎కు అప్పగించారు. మెదక్ జిల్లా ఇంచార్జ్ బాధ్యతల నుంచి మంత్రి సురేఖను తప్పించి.. ఎమ్మెల్యే వివేక్‎కు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ వద్ద ఏ జిల్లా బాధ్యతలు లేవు.