
- కొత్త మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సర్కార్
- పాత ఇన్చార్జ్ మంత్రుల జిల్లాల్లోనూ మార్పులు
- భట్టి, ఉత్తమ్, కొండా సురేఖ, కోమటిరెడ్డికి నో ఇన్చార్జ్ డ్యూటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్లో కొత్తగా చేరిన మంత్రులకు జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. గతంలో ఉన్న ఇన్చార్జ్ మంత్రుల జిల్లాల్లో మార్పుచేర్పులు చేయడంతో పాటు పలువురిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కేబినెట్లో చేరిన మంత్రి వివేక్ వెంకటస్వామిని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్గా నియమించారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న మంత్రి కొండా సురేఖను పక్కనపెట్టారు.
మరో ఇద్దరు కొత్త మంత్రులు వాకిటి శ్రీహరికి ఖమ్మం, అడ్లూరి లక్ష్మణ్కు నల్గొండ జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కను నిజామాబాద్కు, నిజామాబాద్ ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్కు పంపించారు. నల్గొండ ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు కరీంనగర్ బాధ్యతలు అప్పగించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ ( మహబూబ్నగర్), శ్రీధర్ బాబు ( రంగారెడ్డి), పొన్నం ప్రభాకర్ (హైదరాబాద్), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్)ని పాత జిల్లాల్లోనే కొనసాగించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించలేదు.
జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు వీళ్లే..
మంత్రి జిల్లా
దామోదర రాజనర్సింహ మహబూబ్నగర్
శ్రీధర్ బాబు రంగారెడ్డి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్
పొన్నం ప్రభాకర్ హైదరాబాద్
సీతక్క నిజామాబాద్
తుమ్మల నాగేశ్వర రావు కరీంనగర్
జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్
వివేక్ వెంకటస్వామి మెదక్
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నల్గొండ
వాకిటి శ్రీహరి ఖమ్మం