
- కేవలం రెండు నెలల్లో 4.53 కోట్ల పని దినాలు పూర్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. కేంద్రం కేటాయించిన ఆరున్నర కోట్ల పనిదినాల్లో ఇప్పటికే 4.53 కోట్ల పని దినాలు పూర్తయ్యాయి. మొత్తం కేటాయించిన పనిదినాల్లో 70 శాతం టార్గెట్ ను తెలంగాణ రీచ్ అయ్యింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 18.9 లక్షల కుటుంబాల్లోని 28.48 లక్షల మంది ఉపాధి కూలీలకు పని కల్పించారు. ఒక్కొక్క కుటుంబం సగటున 24 రోజుల పని దినాలను పూర్తి చేసుకున్నది.
1,127 కుటుంబాలు వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్నాయి. సగటున ఒక్కో కూలీకి రూ.250.75 రోజువారీ వేతనం లభిస్తున్నది. రోజువారీ వేతనం రూ.307 పొందేలా చర్యలు చేపడుతున్నారు. ఉపాధి పనుల్లో భాగంగా వ్యవసాయ అనుబంధ పనులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ఉపాధి పనుల్లో 60 శాతం వ్యవసాయ అనుబంధ పనులు చేయించాలని లక్ష్యం పెట్టుకోగా.. 50 శాతం నమోదయ్యాయి. ఇందులో ప్రధానంగా ఫాం పాండ్స్, పశువుల కొట్టాలు, మొక్కలు నాటడం వంటి పనులు లక్షకు పైగా కొనసాగుతున్నాయి.
జీపీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్ల వంటి మౌలిక వసతుల కల్పన పనులు 1.31 లక్షలకు పైగా కొనసాగుతున్నాయి. మే నెల ముగిసే నాటికి ఉపాధి హామీలో భాగంగా రూ.1,416 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. అందులో రూ.1,151.67 కోట్లు వేతనాలు కాగా.. రూ.191.03 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్గా నమోదైంది. కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యమైనా కూలీలకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వేతనాలను ఉపాధి కూలీల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు కూలీల ఖాతాల్లో రూ.733.52 కోట్లు జమ అయ్యాయి. వ్యవసాయ అనుబంధ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుండటంతో ఉపాధి పనులకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఉపాధి హామీ పనులకు భారీగా డిమాండ్ పెరిగింది.
పని దినాలు రెట్టింపు చేయాలని కేంద్రాన్ని కోరతాం: సీతక్క
గతంలో మాదిరిగా 12 కోట్ల పని దినాలు తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని మంత్రి సీతక్క తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఉపాధి పని దినాలను సగానికి కేంద్రం కుదించిందన్నారు. కేంద్రం నుంచి అపాయింట్ మెంట్ రాగానే కేంద్ర పెద్దలను కలిసి ఉపాధి పని దినాలను కనీసం 12 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. కేంద్రం నుంచి అనుమతులు వస్తాయన్న నమ్మకంతో ఉపాధి పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిందని మంత్రి తెలిపారు.