- జెన్కో పరిధిలో 750, సింగరేణి పరిధిలో 250 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం
- మందమర్రిలో ఇప్పటికే మెగావాట్ బీఈఎస్ఎస్ ప్లాంట్
హైదరాబాద్, వెలుగు: పీక్ టైమ్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ద్వారా కరెంట్ సప్లయ్ చేస్తూ రాష్ట్రంలో అసలే కరెంట్ కోతలు లేకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఉదయం 6 నుంచి 10, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కొనుగోలు చేసే కరెంట్ ఖర్చును కూడా తగ్గించుకోవాలని యోచిస్తున్నది. రాష్ట్రంలో సోలార్ బ్యాటరీ పవర్తో నడిచే కరెంట్ సప్లయ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా జెన్కో ఆధ్వర్యంలో 750 మెగావాట్లు, సింగరేణిలో 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బీఈఎస్ఎస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మందమర్రిలో నిర్మించిన ఒక మెగావాట్ సామర్థ్యం గల బీఈఎస్ఎస్ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా పనిచేసే తొలి ప్లాంట్ ఇదే కానున్నది.
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) అంటే ఏంటి?
మనం ఇండ్లల్లో కరెంట్ పోయినప్పుడు ఇన్వర్టర్లను ఎలాగైతే ఉపయోగించి విద్యుత్ లైట్లు వెలిగేలా, ఫ్యాన్లు తిరిగేలా పవర్ వినియోగిస్తామో.. అలాగే, భారీ స్థాయిలో బ్యాటరీల సహాయంతో విద్యుత్ శక్తిని నిల్వ చేసి, అవసరమైనప్పుడు దాన్ని వినియోగించే వ్యవస్థనే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) అంటారు. సోలార్, గాలి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి వచ్చే విద్యుత్ను బ్యాటరీలలో నిల్వ చేసి సూర్యుడు లేని సమయంలో.. అంటే పీక్ పీరియడ్లో నిల్వ చేసిన విద్యుత్ను ఉపయోగించుకోవడానికి ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది.
విద్యుత్ నిల్వ చేయడానికి లీథియం, ఐయాన్, ఫ్లో బ్యాటరీలను ఉపయోగిస్తారు. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (బీఎంఎస్), ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎంఎస్) పద్ధతి ద్వారా కరెంట్ సప్లయ్ చేస్తారు. షార్ట్గా చెప్పాలంటే విద్యుత్ను ‘పొదుపు’ చేసి అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడే ఆధునిక బ్యాటరీ వ్యవస్థ అని అర్థం. పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్లో వినియోగించబడని కరెంట్ను ఉచితంగా గ్రిడ్ కు సరఫరా చేయకుండా, బ్యాటరీలో నిలువ చేసుకొని, అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలిగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణిలో ప్రారంభించనున్నారు.
ఉపయోగాలు ఏంటి?
పీక్ టైమ్లో విద్యుత్ కొనుగోళ్ల రేట్లు అధికంగా ఉంటాయి. విద్యుత్ శాఖ ఉద్దేశంలో ఉదయం 6 నుంచి 10, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఉన్న సమయాన్ని పీక్ టైమ్గా పేర్కొంటారు. ఈ టైమ్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. గృహ, ఇండస్ట్రీయల్, ఇతర అవసరాలకు కరెంట్ సప్లయ్ చేయడానికి బయటి నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
యూనిట్పై రూ.1 నుంచి రూ.3 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీంతో కొన్నిసార్లు డిమాండ్కు అనుగుణంగా కరెంట్ సప్లయ్ చేయలేక విద్యుత్ కోతలు విధిస్తారు. దీంతో పెద్ద, పెద్ద ఇండస్ట్రీలు, హాస్పిటల్స్, డేటా సెంటర్లలో బ్యాకప్ పవర్ వినియోగిస్తూ భారీ మొత్తంలో ఖర్చు చేస్తుంటారు.
అయితే, బీఈఎస్ఎస్ సిస్టమ్ ద్వారా విద్యుత్ కోతలను తగ్గించొచ్చు. 24/7 విద్యుత్ పునరుత్పాదక శక్తి అందుబాటులో ఉంచుతుంది. పీక్ టైమ్లో విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. గ్రిడ్ స్థిరత్వం పెరుగుతుంది. వేల కోట్ల రూపాయల విద్యుత్ కొనుగోళ్ల ఖర్చులు తగ్గిపోతాయి.
వెయ్యి మెగావాట్ల విద్యుత్ స్టోరేజీ లక్ష్యం
రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. జెన్కో ఆధ్వర్యంలో 750 మెగావాట్లు, సింగరేణి పరిధిలో 250 మెగావాట్ల స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే మంచిర్యాల జిల్లా మందమర్రిలో 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్తో లింక్ చేసి ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన ప్లాంట్ ను పైలెట్ ప్రాజెక్ట్గా ఏర్పాటు చేశారు. రూ.2.73 కోట్లు ఖర్చుచేశారు.
ఏడాదికి 9.1 లక్షల యూనిట్ల పవర్ను స్టోర్ చేసి పీక్ టైమ్లో ఉపయోగించి ఏడాదికి రూ.70 లక్షలు ఆదా చేసుకోవాలని భావిస్తున్నది. ఇది సక్సెస్ అయితే అన్ని సింగరేణి ఏరియాల్లో 250 మెగావాట్ల సామర్థ్యంతో బీఈఎస్ఎస్ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి సిద్ధమవుతున్నది. టీజీ జెన్కో సంస్థ సైతం మొదటగా 275, 350 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 ప్లాంట్ల పనులు మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నది. దీనికోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. షార్ట్ టైమ్ పాలసీలో 1,600, మీడియం టర్మ్లో 3,800, లాంగ్ టర్మ్లో 7,900 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.
