
- ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 1,922 మంది రైతులకు వర్తింపు
- ఈ ఏడాది 5,177 ఎకరాలకు నీరు
మహబూబాబాద్, వెలుగు: గిరిజన రైతుల పోడు సాగుకు చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పట్టాలిచ్చిన పోడు భూముల్లో సేద్యానికి అవసరమైన సాగునీరు అందించేందుకు ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకువచ్చింది. ఉమ్మడి వరంగల్జిల్లాలో తొలి విడతలో 1,922 మంది రైతులను ఎంపిక చేస్తారు. వీరికి సంబంధించి ప్రభుత్వం ఆర్వోఎఫ్ఆర్పట్టాలు ఇచ్చిన 5,177 ఎకరాల భూమికి నీరందించనున్నారు.
దీనిపై కలెక్టర్లు ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహబూబాబాద్జిల్లాలో గతంలో 214 కుటుంబాలకు గిరి వికాసం పథకం ద్వారా సాగునీటి వసతి కల్పించారు. కొత్తగా గంగారం, కొత్తగూడ, గూడూరు, గార్ల, బయ్యారం, కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్, కురవి మండలాల పరిధిలో 164 గ్రామ పంచాయతీలు, 340 ఆవాస ప్రాంతాలకు చెందిన 24,181 కుటుంబాలకు 67,730 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఇందులో ప్రస్తుతం నీటి వనరులున్న భూములకు కాకుండా ఇతర భూములకు ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ద్వారా సాగు నీటి వసతి కల్పించనున్నారు.
మండల కమిటీల ద్వారా ఎంపిక
ఇందిర సౌర గిరి జల వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం మండల కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఇందులో ఎంపీడీవో, భూగర్భజల అధికారి, ఆర్ డబ్ల్యూఎస్ ఆఫీసర్, గిరిజనాభివృద్ధిశాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. నిర్ణీత ఫార్మాట్ లో గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి, బోరు పడే భూములను గుర్తిస్తారు.
యూనిట్కు రూ.6 లక్షలు..
పథకంలో భాగంగా పోడు భూముల్లో సౌర విద్యుత్సౌకర్యం కల్పించడంతోపాటు రానున్న ఐదేళ్లపాటు డ్రిప్ఇరిగేషన్ద్వారా సాగు నీరందిస్తారు. సౌర విద్యుత్ పంప్సెట్లు నడిపించుకోగా మిగులు విద్యుత్ ను ట్రాన్స్ కోకు అమ్మే అవకాశం ఉంటుంది. మిగులు విద్యుత్ ద్వారా గిరిజన రైతులకు నెలకు సుమారు రూ.5 వేల వరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు తెలిపారు. 100 శాతం రాయితీతో ఒక్కో యూనిట్కు రూ.6 లక్షల చొప్పున ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. సోలార్ విద్యుదుత్పత్తి పరికరాలు అమర్చి, బోరుబావిలో మోటార్బిగించనున్నట్లు చెప్పారు. భూముల స్వభాన్ని బట్టి జామ, మామిడి, నిమ్మ, పూలు, ఆయిల్పాంఇతర తోటలు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు.
సద్వినియోగం చేసుకోవాలి
గిరిజన రైతులు ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మండలాల వారీగా నీటి వసతి సక్రమంగా లేని భూములను గుర్తించి, బోరు, విద్యుత్ మోటార్, సౌర విద్యుత్పరికరాలు అమర్చేందుకు చర్యలు తీసుకుంటాం. రైతులు వివిధ రకాల పంటలు పండించి, ఆర్థికాభివృద్ధి సాధించాలి.
దేశీరామ్ నాయక్, జిల్లా గిరిజనాభివృద్ధి సంస్ధ ఆఫీసర్, మహబూబాబాద్
ఎంపిక చేయనున్న రైతులు, భూ వివరాలు
జిల్లా రైతులు భూమి (ఎకరాల్లో)
మహబూబాబాద్ 1,235 3,403
ములుగు 212 584
భూపాలపల్లి 199 548
వరంగల్ 212 584
హనుమకొండ 64 58