V6 News

ఇరిగేషన్ కు కొత్త రూపు.. సమూల ప్రక్షాళనకు సర్కారు కసరత్తు

ఇరిగేషన్ కు  కొత్త రూపు.. సమూల ప్రక్షాళనకు సర్కారు కసరత్తు
  • డ్యాముల భద్రతకు పెద్దపీట.. 
  • అంతర్రాష్ట్ర వివాదాలపై ఫోకస్
  • ఆ వింగ్స్‌‌‌‌కు ప్రత్యేకంగా ఈఎన్సీల నియామకం
  • టెరిటోరియల్​ ఈఎన్సీ పదవులు రద్దు
  • కాళేశ్వరం, నాగార్జునసాగర్​, పాలమూరు, శ్రీరాంసాగర్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక సీఈలు
  • మేజర్​ ఇరిగేషన్​ నుంచి మైనర్​ ఇరిగేషన్​ తొలగించి ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు
  • నాలుగైదు విభాగాలకు ప్రత్యేకంగా స్టేట్​ లెవెల్​ సీఈలు
  • ఓ అండ్​ ఎం ఈఎన్సీ పదవి రద్దు యోచన

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ఇరిగేషన్​ డిపార్ట్‌‌‌‌మెంట్​ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పుడున్న వ్యవస్థను సమూలంగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నది. మెరుగైన ఇరిగేషన్​ వ్యవస్థతో రైతులకు మరింత మేలు చేయాలని సంకల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి బీఆర్‌‌‌‌ఎస్​ ప్రభుత్వం ఇరిగేషన్‌‌‌‌ను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా ఓ అండ్​ఎంను ప్రత్యేక కేటగిరీగా పెట్టింది. మేజర్​ ఇరిగేషన్​లో మైనర్​ ఇరిగేషన్‌‌‌‌ను కలిపేసింది. కొత్తగా టెరిటోరియల్​ ఇంజినీర్లు, టెరిటోరియల్​ ఈఎన్సీలు, హెడ్​క్వార్టర్​ ఈఎన్సీలు అంటూ కొత్త పోస్టులను 
తీసుకొచ్చింది. అయితే, దీని వల్ల నష్టమే తప్ప.. మేలు జరగడం లేదని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగానే మరోసారి శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించింది. డ్యాముల భద్రతపై ప్రత్యేక ఫోకస్​ పెట్టింది. ఇప్పటికే స్టేట్​ డ్యామ్​ సేఫ్టీ ఆర్గనైజేషన్​ (ఎస్డీఎస్​వో) ఉండగా.. దానికి మరిన్ని పవర్స్​ ఇవ్వనున్నది. దాంతోపాటు ఓ అండ్​ ఎంను ప్రత్యేక వింగ్‌‌‌‌గా తీసేసి.. జిల్లాల అధికారులకే అప్పజెప్పేందుకు ఆలోచిస్తున్నది. ఇవే కాకుండా మరిన్ని అంశాలతో పలు ప్రతిపాదనలను ఇరిగేషన్​ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్​ దాస్​.. 2 నెలల కింద మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డికి పంపించారు. అడ్మినిస్ట్రేటివ్​ రోల్స్​ నుంచి.. ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్వహణ వరకు ఏం చేయాలి? డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఎలా గాడిలో పెట్టాలి? అన్న విషయాలను వివరించారు.అయితే, ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. ప్రాజెక్టుల సమగ్రమైన నిర్వహణకు ఫీల్డ్​ అధికారులు చాలా కీలకమని, ఆయా పోస్టులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. 

4 ప్రాజెక్టులకు స్పెషల్​ ఆఫీసర్లు..

గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన దుస్థితి మరే ప్రాజెక్టుకూ రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు ప్రత్యేకంగా  సీఈ స్థాయి అధికారిని నియమించాలని భావిస్తున్నది. అందులో భాగంగా 4 ప్రాజెక్టులను ఇరిగేషన్​ సలహాదారు ఆ జాబితాలో పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​, పాలమూరు లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​, నాగార్జునసాగర్​+ఏఎమ్మార్పీ లిఫ్ట్​, శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులను జాబితాలో చేరుస్తున్నారు. ఆయా ప్రాజెక్టులకు ప్రత్యేకంగా ఒక సీఈని నియమించాలని సూచించారు. ఈ అధికారులు ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు మెయిన్​ కెనాల్స్​, బ్రాంచ్​ కెనాల్స్​, పంప్​హౌస్‌‌లలాంటి వాటికి ఎప్పటికప్పుడు రికార్డులను మెయింటెయిన్​ చేయాల్సి ఉంటుంది. అవసరమనుకుంటే ప్రభుత్వానికి, సెంట్రల్​ వాటర్​ కమిషన్‌‌కు వివరించాల్సి ఉంటుంది. దానికి అదనంగా లిఫ్టులకు ఇద్దరు డీఈఈలు (ఒక ఎలక్ట్రికల్​, ఒక మెకానికల్ ఇంజినీర్లు), ఇద్దరు ఎలక్ట్రికల్, మెకానికల్​ విభాగాల ఏఈఈలనూ నియమించాలని పేర్కొన్నారు. లిఫ్టుల ఆపరేషన్‌‌కు సంబంధించి ఆయా అధికారులకు సమగ్రమైన శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. 

అధికారుల పునర్వ్యవస్థీకరణ..

అధికార వ్యవస్థనూ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించనున్నది. ఈఎన్సీ జనరల్​, ఈఎన్సీ అడ్మిన్​ యథావిధిగానే ఉంచి.. కొన్ని టెరిటోరియల్​ ఈఎన్సీల పదవులను తొలగించాలని భావిస్తున్నారు. మరికొన్ని విభాగాలకూ ఈఎన్సీలను నియమించేలా కసరత్తు చేస్తున్నారు. కమిషనర్​ ఆఫ్​ టెండర్స్​, వాలంతరీలకు ఈఎన్సీలను నియమించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇక, అంతర్రాష్ట్ర జలవివాదాలు అత్యంత కీలక దశలో ఉన్నందున.. దానినీ ఓ ప్రత్యేకమైన విభాగంగా మార్చాలని ప్రతిపాదించారు. డ్యాముల సేఫ్టీ, అంతర్రాష్ట్ర జలవివాదాలు, హైడ్రాలజీ సంబంధింత అంశాలకు ఒక ఈఎన్సీని నియమించాలని సూచించారు. శాఖలోని ప్రధానాంశాలను పైస్థాయి అధికారులు, ప్రభుత్వానికి నివేదించేలా సెక్రటేరియెట్‌‌లో అడిషనల్​ సెక్రటరీ స్థాయి అధికారిని ఈఎన్సీగా నియమించాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. అదే సమయంలో ఆపరేషన్​అండ్​ మెయింటెనెన్స్‌‌కు ఈఎన్సీని తొలగించే ప్రతిపాదనలూ ప్రభుత్వం ముందు పెట్టారు. ఇక, మరికొన్ని కీలకమైన విభాగాలకు రాష్ట్రస్థాయిలో పనిచేసేలా చీఫ్​ ఇంజినీర్లను నియమించాలని సూచించారు. మైనర్​ ఇరిగేషన్​, హైడ్రాలజీ, సెంట్రల్​ డిజైన్స్​ ఆర్గనైజేషన్​, క్వాలిటీ కంట్రోల్​, ఎంక్వైరీస్​ విభాగాలకు స్టేట్​లెవెల్​ సీఈలను నియమించాలని ప్రతిపాదించారు.  

మైనర్​ ఇరిగేషన్​ స్పెషల్..

గత బీఆర్ఎస్​ ప్రభుత్వం మైనర్​ ఇరిగేషన్‌‌ను మేజర్​ ఇరిగేషన్‌‌లోనే కలిపేసింది. దీంతో చెరువుల పునరుద్ధరణ, మెయింటెనెన్స్‌‌ కష్టమైపోతున్నది. ఈ క్రమంలోనే మైనర్​ ఇరిగేషన్‌‌ను మేజర్​ ఇరిగేషన్​ నుంచి తొలగించేసి.. ప్రత్యేక వ్యవస్థగా చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అందుకు తగ్గట్టుగా జిల్లాల్లో ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. దీంతో జిల్లా సీఈలు కేవలం మేజర్​, మీడియం ప్రాజెక్టుల బాధ్యతలనే చూసుకోనున్నారు. ఇక, ఓ అండ్​ ఎం బాధ్యతలు, అధికారాలను  జిల్లా సీఈలకే అప్పగించాలని సూచించారు. మరోవైపు గత ప్రభుత్వం కరీంనగర్​, గజ్వేల్​, రామగుండం, నిజామాబాద్‌‌కు ఈఎన్సీలను నియమించింది. ఇప్పుడు ఆ టెరిటోరియల్​ ఈఎన్సీ పదవులనూ తప్పించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.