
- రైతుల కోసం ప్రతి ఏటా రూ. 70వేల కోట్లు ఖర్చు చేస్తున్నం: భట్టి విక్రమార్క
- రైతన్నల ఆశీర్వాదంతోనే ప్రజా పాలన: మంత్రి పొన్నం
- రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు
హైదరాబాద్, వెలుగు: రైతులు పంట పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా వేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతుల కోసం ప్రతి ఏటా రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్కు, వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పదేండ్లలో పంట పరిహారం గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగులో ఉన్న 1.49 కోట్ల పైబడి ఎకరాలకు.. ఎకరాకు 12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామన్నారు. రైతులు, ప్రజలకోసం పథకాలు అమలు చేస్తుంటే.. ఇక తమకు పుట్టగతులు ఉండవనే భయంతో ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రూ. 21 వేల కోట్లతో రైతు రుణమాఫీ పూర్తిచేశామని, గత సర్కారు వదిలి వెళ్తే.. కేబినెట్లో చర్చించి రైతు భరోసా కింద 13,088 కోట్లు జమ చేశామని చెప్పారు. సన్నధాన్యం సాగుచేసిన రైతులకు క్వింటాల్కు 500 చొప్పున బోనస్ కింద 1,199 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పంట నష్టం కింద 260 కోట్లు విడుదల చేశామని, రైతుల ఇన్సూరెన్స్ కోసం 2,181 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోని 29 లక్షల పంపుసెట్లకు ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరాకు 16,691 కోట్లు రైతుల పక్షాన ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ అధికారులకు చెల్లింపులు చేస్తుందని తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 11 వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు
కష్టమైనా సాయమందిస్తున్నం: మంత్రి తుమ్మల
రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఎంత కష్టమైనా వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారని అన్నారు. రైతన్నల ఆశీర్వాదంతో తెలంగాణ లో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వ్యవసాయ శాఖ ను స్వయంగా రైతు అయిన మంత్రి తుమ్మల పర్యవేక్షణ లో ముందుకు పోతున్నదని చెప్పారు.
రైతులకు అండగా ప్రభుత్వం: మంత్రి వివేక్ వెంకటస్వామి
ప్రజా ప్రభుత్వం రైతుల పక్షాన్నే ఉంటుందని ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి మరోసారి చాటారని కార్మిక, మైనింగ్శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం మాటలు రాష్ట్ర రైతాంగానికి ఆశాజ్యోతి గా నిలిచాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు సీఎం ఆలోచనలు, నిర్ణయాలు రైతు కేంద్రంగా రాష్ట్రాభివృద్ధికి దారితీస్తున్నాయని తెలిపారు. ఇది నిజమైన ప్రజా ప్రభుత్వం అని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ సర్కారు పెట్టిపోయిన అప్పులను కడుతూ.. రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్లు విడుదల చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రైతులను అప్పుల్లో ముంచారని.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ద్వారా ఆత్మగౌరవంతో జీవించే మార్గం ఏర్పడిందని తెలిపారు. సన్న వడ్లకు రూ.500 బోనస్తోపాటు సబ్సిడీలతో రైతుకు నేరుగా లాభం కలుగుతుందని చెప్పారు.