
- ప్రస్తుతమున్న 80% నుంచి 40 శాతానికి తగ్గింపు
- దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు
- అర్బన్లో 2 లక్షలు, రూరల్లో 1.50 లక్షల లోపు ఆదాయం ఉన్నోళ్లు అర్హులు
హైదరాబాద్, వెలుగు: 40 శాతం వైకల్యమున్న దివ్యాంగులకూ పరికరాలు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతమున్న వైకల్యం శాతాన్ని 80 నుంచి 40కి తగ్గించింది. ఈ మేరకు దివ్యాంగుల పరికరాల పంపిణీకి సంబంధించి గైడ్లైన్స్లో మార్పులు చేసింది. దీనిపై మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రాంచంద్రన్ గురువారం జీవో నెంబర్ 89 జారీ చేశారు.
దివ్యాంగులకు ప్రభుత్వం ఇవ్వనున్న పరికరాల్లో బ్యాటరీ బండ్లు, ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, హ్యాండ్ స్టిక్స్, వాకింగ్ స్టిక్స్, బ్రెయిలీ బుక్స్, హియరింగ్ ఎయిడ్స్, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్స్ ఉన్నాయి. కాగా, రాష్ర్టంలో దివ్యాంగులు 9 లక్షల మంది ఉండగా.. వీరిలో 40 శాతం, ఆపై వైకల్యం ఉన్నోళ్లే 85 శాతం ఉంటారని అధికారులు చెబుతున్నారు.
ఇవీ అర్హతలు..
దివ్యాంగులకు పరికరాల పంపిణీకి సంబంధించి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షల లోపు ఉండాలి. అర్హులు tgobmms.cgg.govt.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హులను గుర్తించేందుకు జిల్లాల్లో ఐదుగురు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అడిషనల్ కలెక్టర్ చైర్మన్గా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్, డీఎంహెచ్వో, ట్రాన్స్ పోర్ట్, వెల్ఫేర్ ఆఫీసర్లు కమిటీలో మెంబర్లుగా ఉన్నారు.
దేశంలోనే తొలిసారి..
ప్రస్తుతం 80 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకే కేంద్ర ప్రభుత్వం పరికరాలు పంపిణీ చేస్తున్నది. అన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ ప్రస్తుతం 80 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకే పరికరాలు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు దీన్ని ప్రభుత్వం 40 శాతానికి తగ్గించింది. ఇది దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు కానుంది. బ్యాటరీ బండ్లు, ట్రై సైకిళ్లు, వీల్ చైర్లతో పాటు దివ్యాంగులు ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా ఉపాధి పొందేందుకు ఎలక్ర్టిక్ కమర్షియల్ వెహికల్స్ కూడా వాళ్లకు అందించనున్నారు.
ఇప్పటి వరకు పీహెచ్డీ పూర్తి చేసిన దివ్యాంగులకు మాత్రమే ల్యాప్టాప్లు ఇస్తుండగా, ఇకపై డిగ్రీ పూర్తి చేసినోళ్లకు కూడా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి వైకల్యం శాతాన్ని 75 నుంచి తగ్గించారు. అంధులకు 50 శాతం, బధిరులకు 51 శాతంగా నిర్ణయించారు. అదే విధంగా అర్హులైన దివ్యాంగులకు 5జీ స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వనున్నారు.
దివ్యాంగుల సంక్షేమంలో సువర్ణాధ్యాయం..
40 శాతం వైకల్యమున్న దివ్యాంగులకూ పరికరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం జీవో ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయం. ఇది దివ్యాంగుల సంక్షేమంలో సువర్ణాధ్యాయం. దీనికోసం గత పదేండ్లుగా దివ్యాంగులు పోరాటం చేస్తున్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వైకల్యం శాతం తగ్గింపుతో లక్షలాది మంది దివ్యాంగులకు మేలు జరుగుతుంది.
వైకల్యం శాతం తగ్గించాలని పీసీసీ చీఫ్గా ఉన్నపుడు, సీఎం అయ్యాక రేవంత్ రెడ్డికి దివ్యాంగులు విజ్ఞప్తి చేశారు. మా సూచనలు పరిగణనలోకి తీసుకొని వైకల్యం శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు ఇవ్వటం అభినందనీయం. దివ్యాంగులందరి తరఫున సీఎంకు, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
- ముత్తినేని వీరయ్య,
వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్