
- జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు అమలు
- పరిశుభ్రత, ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వంద రోజుల యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వం మొదలుపెట్టింది. పరిశుభ్రత, ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా సోమవారం నుంచి సెప్టెంబరు 10వ తేదీ వరకు అన్ని మున్సిపాలిటీల్లో 51 అంశాలతో యాక్షన్ ప్లాన్అమలు చేయనున్నారు. ఇందులో మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు, వివిధ శాఖల అధికారులను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. దీంతో మహిళా సంఘాలకూ ఆదాయం సమకూరనుంది. ఈ యాక్షన్ప్లాన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ఎమర్జ్చేయనున్నారు. దీంతో కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు రానున్నాయి. ఇందులో పరిశుభ్రతలో భాగంగా మురుగు కాలువలు, నాలాలు, ఓపెన్, భూగర్భ డ్రైనేజీల్లో పూడికతీత పనులు, ముంపు ప్రాంతాల్లో డ్రైనేజీలు శుభ్రం చేయడంతోపాటు మ్యాన్ హోళ్లను గుర్తించి మరమ్మతులు చేపట్టనున్నారు.
నర్సరీల ఏర్పాటు
వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా వన మహోత్సవం కూడా నిర్వహించనున్నారు. మొక్కలను నాటడమే కాకుండా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నర్సరీలను ఏర్పాటు చేయనున్నారు. అమృత్ మిత్ర 2.0 ద్వారా ఆయా పురపాలికల్లో ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి ‘ఉమెన్ ఫర్ ట్రీ’ పేరిట మహిళలతో మొక్కలు నాటించి సంరక్షించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతోపాటు మున్సిపాలిటీల్లో అన్ని పార్కులు, ఇళ్ల వద్ద, చెరువు కట్టలు, క్రీడా ప్రాంగణాలు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు. వంద రోజుల ప్రణాళికలో పారిశుద్ధ్య నిర్వహణతోపాటు ప్రజారోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
వీధి వ్యాపారులకు రుణాలు
వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులను గుర్తించడం, వారికి రుణాలు ఇప్పించడం, కొత్త పొదుపు సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేగాక..కొత్తగా ఏర్పాటు చేసిన సంఘాలకు రుణాలు ఇప్పించడం, కొత్తగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.