
- అసెంబ్లీలో తీర్మానం మేరకు జీవో రిలీజ్
- మరో ఉత్తర్వులో గైడ్లైన్స్, ఇతర వివరాలు
- అసెంబ్లీలో తీర్మానం మేరకు జీవో
హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో సమగ్ర కలగణన చేపట్టేందుకు అసెంబ్లీ తీర్మానం, కేబినెట్ లో నిర్ణయానికి అనుగుణంగా బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శుక్రవారం జీవో నంబర్ 26 ను జారీ చేశారు. కులగణన ఇతర ఆపరేషనల్ గైడ్ లైన్స్, వివరాలు.. మరో ఉత్తర్వు ద్వారా విడుదల చేస్తామని వెంకటేశం పేర్కొన్నారు. కులగణనకు రూ.150 కోట్లు ఖర్చవుతుందనే అంచనాతో ఇటీవల బడ్జెట్ లో ప్రభుత్వం నిధులు కేటాయించింది.
ఇంటింటికీ వెళ్లి చదువు, ఉద్యోగం, ఉపాధి, జీవన స్థితి, కుటుంబస్థాయి, ఆర్థిక పరిస్ధితి వంటి అంశాలను ఈ కులగణనలో ప్రభుత్వం సేకరించనున్నది. రాష్ట్రంలో సమగ్ర కులగణనకు ప్రభుత్వం జీవో నెంబర్ 26 విడుదల చేయడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
కుల గణన నిర్ణయం విప్లవాత్మక నిర్ణయం
రాహుల్ పేర్కొన్నట్లు సమగ్ర కుల సర్వే విప్లవాత్మక నిర్ణయమని పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ నేతలు ఆకునూరి మురళి, ప్రొఫెసర్లు పద్మజా షా, తిరుమలై, మురళీ మోహన్, దేవళ్ల సమ్మయ్య, సింహద్రి అన్నారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, జాతీయతను ముందుకు తీసుకెళుతుందని శుక్రవారం ఓ ప్రకటనలో వారు పేర్కొన్నారు.