ఎస్సారెస్పీలో ఎకో టూరిజం .. జలాల్ పూర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా మార్చేందుకు సర్కార్​ ఫోకస్​

ఎస్సారెస్పీలో ఎకో టూరిజం .. జలాల్ పూర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా మార్చేందుకు సర్కార్​ ఫోకస్​
  • మూడు ఎకరాల భూమి కేటాయింపు
  • గురువారం రైతుల ఒపీనియన్ సేకరణ
  • టూరిజం ఏర్పాటుపై పర్యాటకుల హర్షం

బాల్కొండ,వెలుగు: ప్రకృతి అందాలకు నెలవైన ఎస్సారెస్పీ బ్యాక్​ వాటర్​ ప్రాంతాన్ని ఎకో టూరిజం స్పాట్​గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కార్​ ఫోకస్ పెట్టింది.  గలగల పారే గోదారమ్మ ఒడ్డున పచ్చని చెట్లు, బయళ్లు, చూపరుల మనస్సును కట్టిపడేసే జలాల్ పూర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా ఎంచుకున్నారు. ఈ ప్రాంతంలో పర్యా టకులకు మరింత ఆహ్లాదం పంచడంతో పాటు సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి, ఆదాయ వనరులు పెంచేందుకు ప్రణాళికలు రెడీ చేసింది. 

ఈ విషయంలో గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇరిగేషన్ ల్యాండ్ ను టూరిజం శాఖకు బదిలీ కూడా చేశారు.  మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ఐలాండ్స్, ప్రకృతి అందాలు, అనేక జీవ జాతులు ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని టూరిజం మంత్రి జూపల్లిని పలుమార్లు కోరారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్​ బ్యాక్ వాటర్ పై ఉన్న బాసర పుణ్యక్షేత్రం వరకు బోటు ఫెసిలిటీ కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.  

చరిత్ర కలిగిన ఆలయాలు..

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్​ నిర్మాణ క్రమంలో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఎంతో ప్రాశస్త్యం కలిగిన కుస్థాపూర్ మల్లన్న, రత్నాపూర్, ఉమ్మెడ శివాలయాలు ఉన్నాయి. టూరిజం స్టార్ట్ అయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి కానుందని జలాల్ పూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామస్తుల నుంచి ఒపీనియన్ తీసుకున్నారు. ప్రభుత్వం మూడు ఎకరాల భూమి కేటాయించిందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రణవీర్ తెలిపారు. 

గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన స్టేట్ చీఫ్​కన్జర్వేటర్​

​నందిపేట, వెలుగు : డొంకేశ్వర్ మండలం గాదేపల్లి, చిన్నయానం శివారులోని ఎస్పారెస్పీ గోదావరి పరీవాహక ప్రాంతాన్ని గురువారం తెలంగాణ రాష్ట్ర అడిషనల్​ ప్రిన్స్​పల్ చీఫ్​ కన్జర్వేటర్ ఆఫ్​ ఫారెస్ట్​ సునీతాభగవత్​ పరిశీలించారు. టూరిజం ఏర్పాటు, భూములు ఇచ్చేందుకు రైతులు ఇష్టంగా ఉన్నారా అని రైతుల నుంచి ఒపీనియన్ తీసుకున్నారు. భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు ఆమె దృష్టికి తెచ్చారు. ఎకో టూరిజం ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు కలిగే ప్రయోజనాలకు ఆమె రైతులకు వివరించారు.  ఆమె వెంట వైస్ చైర్మన్, ఎండీ రంజిత్ నాయక్, డీఎఫ్ వో వికాస్ మీనా, ఆర్మూర్ ఎఫ్డీవో భవానీ శంకర్, ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్,డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రణవీర్, ఎఫ్ఎస్ వో గణేశ్ ఉన్నారు. మరో పది రోజుల్లో టూరిజం పనులు పట్టాలెక్కనున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు పేర్కొన్నారు.

ఎస్సారెస్పీలోకి 3310 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్​ఎగువ గోదావరి బేసిన్ లో కురుస్తున్న వర్షాలకు గురువారం 3310 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్​పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు, 80.51 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్​లో 1062.00 అడుగులు,12.55 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ కొత్త రవి తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో గరిష్ఠంగా 3310 క్యూసెక్కుల వరద నీరు రావడం ఇదే మొదటిసారి. కాకతీయ కెనాల్ ద్వారా 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కు తాగునీటి కోసం 231 క్యూసెక్కులు విడుదల కాగా, ఆవిరి రూపంలో 321 క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్ట్​లో 1056.20 అడుగులు,7.41 టీఎంసీల నీరు ఉంది.