హైదరాబాద్​లో 13 డిపోలు మూసివేతకు ప్లాన్

హైదరాబాద్​లో 13 డిపోలు మూసివేతకు ప్లాన్
  • మూసేసి లీజుకు ఇచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు
  • ఆమ్దానీ రాబట్టుకునేందుకు ప్లాన్​
  • హైదరాబాద్​లో 13 డిపోలు క్లోజ్ ​చేసే యోచన
  • ఇటీవల పికెట్.. తాజాగా హైదరాబాద్–3 బంద్​
  • తుది దశకు బీహెచ్‌ఈఎల్‌ డిపో తరలింపు
  • త్వరలో జిల్లాల్లోనూ పది దాకా మూత!

హైదరాబాద్‌, వెలుగు: ఒక్కొక్కటిగా ఆర్టీసీ బస్‌ డిపోలను సర్కారు మూసేస్తున్నది. ఇటీవల పికెట్‌ డిపో క్లోజ్‌ చేయగా, ఇప్పుడు హైదరాబాద్‌–3 డిపోను బంద్​ చేసింది.  బీహెచ్‌ఈఎల్‌ డిపోను ఇప్పటికే సగం ఖాళీ చేసింది. ఇట్లా హైదరాబాద్ ​సిటీలో ఉన్న 29 డిపోల్లో దాదాపు13 డిపోలను మూసివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొన్ని డిపోలు క్లోజ్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తున్నది. మూసేసిన డిపోల పరిధిలోని జాగాలను, బిల్డింగ్ లను లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్‌ చేస్తున్నది. దీని ద్వారా ఏటా ఆమ్దానీ రాబట్టుకోవాలని భావిస్తున్నది. 

బస్సులు తగ్గాయని.. స్టాఫ్ లేరంటూ..

రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలున్నాయి. 9,708 బస్సులుండగా.. ఇందులో 3,107 హైర్‌ బస్సులు నడుస్తున్నాయి. బస్సుల సంఖ్య తగ్గిందని, స్టాఫ్‌  లేరని, ఓఆర్‌ తగ్గిందనే కారణాలు చెప్తూ డిపోలు తగ్గిస్తున్నారు. ఇటీవలే పికెట్‌ డిపోను మూసేశారు. తాజాగా హైదరాబాద్ –3 డిపోను క్లోజ్ చేశారు. ఇందులో 40 దాకా బస్సులు, 100కు పైగా స్టాఫ్‌ ఉన్నారు. ఇక్కడున్న బస్సులను మియాపూర్‌–1 డిపోకు తరలించారు. స్టాఫ్‌‌‌‌కు ఆప్షన్లు ఇచ్చి ఇతర ప్రాంతాలకు పంపించారు. అయితే హైదరాబాద్​ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– ‌‌‌‌3 డిపోలోని బస్సులన్నీ ఏపీకి వెళ్లే లాంగ్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ బస్సులు కావడంతో మియాపూర్‌‌‌‌కు తరలించినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఇక బీహెచ్‌‌‌‌ఈఎల్‌‌‌‌ డిపోను సగం ఖాళీ చేశారు. కొన్ని బస్సులను రాణిగంజ్‌‌‌‌ డిపోలకు తరలించారు. స్టాఫ్‌‌‌‌ అడ్జస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ కూడా చివరి
 దశకు చేరింది.

డిపోల స్థలాలు లీజుకు! 

ఆర్టీసీని లేదా సంస్థ ఆస్తులను ప్రైవేట్‌‌‌‌కు అప్పగిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. నాలుగు నెలల్లో సెట్‌‌‌‌ కాకపోతే సీఎం కేసీఆర్‌‌‌‌ ఆర్టీసీని ప్రైవేట్​కు  ఇచ్చేస్తామన్నారని సంస్థ చైర్మన్ కూడా మొన్నామధ్య ప్రకటించారు. ఇప్పుడు డిపోలు బంద్‌‌‌‌ చేయడంపై మళ్లీ చర్చ జరుగుతోంది. హైదరాబాద్​లో  ఒక్కో డిపో మూడు నుంచి ఐదు ఎకరాల్లో ఉంది. ఇటీవల ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారిగా బోర్డును ఏర్పాటు చేశారు. అయితే ప్రైవేట్‌‌‌‌ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని టీఎంయూకు చెందిన ఓ కీలక నేత అన్నారు. లీజుకు సంబంధించిన టెండర్లను త్వరలోనే ఆహ్వానించనున్నట్లు తెలిసింది. దీని ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని సంస్థ ప్లాన్‌‌‌‌ చేస్తోంది. 

డిపోల తగ్గింపు తప్పుడు నిర్ణయం

వరుసగా డిపోలను మూసేస్తూ సంఖ్య తగ్గించడం సరికాదు. ఇది తప్పుడు నిర్ణయం. దీన్ని కార్మికులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తరు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తం. డిపోల తగ్గింపు ఆలోచనను ఆర్టీసీ మేనేజ్‌మెంట్‌ మానుకోవాలి. 
- తిరుపతి, స్టేట్‌ ప్రెసిడెంట్‌, టీఎంయూ