
- ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలి
- కలెక్టర్లకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: భూ సమస్యలపై వచ్చిన అప్లికేషన్లను జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్లకు సీఎస్ రామకృష్ణారావు సూచించారు. ప్రజల జీవితాల్లో శాశ్వత ప్రభావం చూపేలా జిల్లా కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని అన్నారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తమ జిల్లాల్లో సమర్థవంతంగా అమలు చేయడానికి కలెక్టర్లకు అపారమైన అవకాశం ఉందని తెలిపారు. మంగళవారం కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వన మహోత్సవం, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం, ఎరువుల లభ్యత, ఆయిల్ పామ్ విస్తరణ, భూ భారతి, సీజనల్ వ్యాధులు, టీబీ ముక్త్ భారత్, వైద్య కళాశాలల అవసరాలు లాంటి పలు అంశాలపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
మంజూరు చేసిన అన్ని ఇండ్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వన మహోత్సవం సందర్భంగా.. జిల్లా పర్యవేక్షణ సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించి, సంబంధిత విభాగాలతో జిల్లాలో సమర్థవంతంగా సమీక్షించాలని అన్నారు. వన మహోత్సవంలో మంచి నాణ్యత గల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయా? లేదా? అనే విషయాలను నిర్ధారించుకోవాలని, ముఖ్యంగా పండ్ల మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని, మొక్కల మనుగడను కూడా పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారు.