
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాల (జేఎన్వీ) క్లాసులు జులై14న ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా తెలిపారు. సోమవారం సెక్రటేరియెట్లో స్కూళ్ల ఓపెనింగ్ కు సంబంధించి యోగితారాణా అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. దీనికి నవోదయ విద్యాలయాల సమితి (ఎన్వీఎస్) హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ టి. గోపాల్ కృష్ణ, అసిస్టెంట్ కమిషనర్లు టి. సూర్య ప్రకాశ్, బి. చక్రపాణి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ తదితరులు హాజరయ్యారు.
కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్నగర్, మేడ్చల్–-మల్కాజ్గిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఏడు నవోదయ స్కూళ్లను ప్రారంభించనున్నారు. ఈ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బంది నియామకం, విద్యా ప్రణాళిక, జిల్లా యంత్రాంగంతో సమన్వయంపై చర్చించారు. నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వచ్చేనెల 14 నుంచి క్లాసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వీటి ద్వారా గ్రామీణ మెరిట్ స్టూడెంట్లకు క్వాలిటీ రెసిడెన్షియల్ విద్య అందించనున్నట్టు వెల్లడించారు.