కొత్త పరిశ్రమలు తీసుకొస్తం : మంత్రి శ్రీధర్ బాబు

కొత్త పరిశ్రమలు తీసుకొస్తం : మంత్రి శ్రీధర్ బాబు
  • యువతకు ఉపాధి కల్పిస్తం: మంత్రి శ్రీధర్ బాబు
  • ఏడాదిన్నరలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని వెల్లడి 
  • ఎవర్జెంట్  టెక్నాలజీస్  గ్లోబల్ వాల్యూ సెంటర్​ను ప్రారంభించిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం నానక్ రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అమెరికాకు చెందిన ఎవర్జెంట్ టెక్నాలజీస్  గ్లోబల్ వాల్యూ సెంటర్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్ నేతృత్వంలో ఏడాదిన్నర వ్యవధిలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్  లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు హబ్ గా రాష్ట్రాన్ని మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 ఏఐ రాజధానిగా హైదరాబాద్ ను మార్చాలనే సంకల్పంతోనే ఫ్యూచర్  సిటీలో  200 ఎకరాల్లో ఏఐ సిటీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తెలంగాణ యువతను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు స్కూల్​ స్థాయి నుంచే శిక్షణ ఇచ్చేలా నిపుణుల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఏటా రాష్ట్రంలో 2 లక్షల మంది ఇంజినీరింగ్  పట్టా తీసుకుంటున్నారని, కానీ... వీరిలో చాలా మందికి పరిశ్రమలకు అవసరమైన కనీస నైపుణ్యాలు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు యంగ్  ఇండియా స్కిల్స్  యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. 

రాబోయే రోజుల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్ కు చేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. ఆవిష్కరణలకు హబ్ గా తెలంగాణను మార్చేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. హైదరాబాద్ లోని గ్లోబల్  కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ను గ్లోబల్  వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చిదిద్దుతామన్నారు. ఎవర్జెంట్ టెక్నాలజీస్ గ్లోబల్ వాల్యూ సెంటర్ ద్వారా ప్రస్తుతం 600 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి భవానీశ్రీ, ఐటీ సలహాదారు సాయికృష్ణ, ఎవర్జెంట్ టెక్నాలజీస్ ఫౌండర్, సీఈవో విజయ్  సజ్జ తదితరులు పాల్గొన్నారు.