
- నిధులు లేక ఖాళీగా ఉంటున్న బీసీ సంక్షేమ శాఖ
- పెండింగ్లో 5.2 లక్షల లోన్ అప్లికేషన్లు
- ఆత్మగౌరవ భవనాలకు పునాదులు పడలే
- మూడేండ్ల నుంచి ఫెడరేషన్లకు పైసా దిక్కు లేదు
- ఎంబీసీ కార్పొరేషన్కు చైర్మన్నే నియమించలే
- నాయీ బ్రాహ్మణులకు మోడర్న్ సెలూన్ షాపులు, రజకులకు డ్రైయింగ్ మెషీన్లు పత్తాలేవు
- చేనేత కార్మికులకు బీమా ఏదీ? హెల్త్ కార్డులేవి?
- ఎన్నికలప్పుడే గొర్రెల పంపిణీ!
హైదరాబాద్, వెలుగు: బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వాళ్ల కోసం సబ్ప్లాన్ తీసుకొస్తామని చెప్పిన రాష్ట్ర సర్కారు ఆ హామీని గాలికొదిలేసింది. నాలుగేండ్ల కింద బీసీ మంత్రులు, బీసీ ప్రజాప్రతినిధులతో మూడురోజులపాటు స్పెషల్గా మీటింగ్ పెట్టి 210 తీర్మానాలను ఆమోదించి, ఆపై చేతులు దులుపుకొంది. సబ్ ప్లాన్తో నిధులు వస్తే బాగుపడతామని ఆశిస్తే.. ఉన్న ఫండ్స్నే ఏటా బడ్జెట్లో ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోంది. నిధులు లేకపోవడంతో బీసీ సంక్షేమ శాఖ ఉత్తగనే ఉంటోంది. బీసీ పథకాలు సక్కగ అమలైతలేవు. కార్పొరేషన్లను, ఫెడరేషన్లను పట్టించుకునే దిక్కు లేదు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. నాయీబ్రాహ్మణులకు ఇచ్చిన మోడర్న్ సెలూన్ల హామీ పత్తాలేదు. రజకులకు దోభీఘాట్ల నిర్మాణాలు, డ్రైయింగ్ మెషీన్ల పంపిణీకి అతీగతీలేదు. నేతన్నలకు ఇచ్చిన హామీలూ అమలైతలేవు. రెండేండ్లుగా గొర్రెల పంపిణీ కూడా నడుస్తలేదు. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే తప్ప గొర్రెలను పంపిణీ చేయడం లేదు. స్వయం ఉపాధి లోన్ల కోసం దరఖాస్తులు చేసుకొని ఏండ్లకేండ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. బీసీల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తేవడానికి సీఎం కేసీఆర్.. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో 2017 డిసెంబర్లో అసెంబ్లీ లాంజ్లో భేటీ అయ్యారు.3 రోజులు జరిగిన ఈ సమావేశాల్లో మొదటి రోజు సీఎం హాజరయ్యారు. బీసీల సమస్యలపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఆఖరికి 210 తీర్మానాలు చేసి, ఆమోదించారు. ఎడ్యుకేషన్, హెల్త్, రిజర్వేషన్లు, ఉపాధి తదితర రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేస్తామని నిర్ణయించారు. ఇదే అంశంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేశారు. శాసనమండలిలో తీర్మానం కూడా చేశారు. దాదాపు నాలుగేండ్లవుతున్నా బీసీ సబ్ప్లాన్ కోసం అడుగు ముందుకు పడలేదు. ప్రతి బడ్జెట్కు ప్రకటిస్తారని బీసీలు ఎదురు చూస్తున్నా నిరాశే మిగులుతోంది.
5.2 లక్షల లోన్ అప్లికేషన్లు పెండింగ్
తెలంగాణ వచ్చినప్పటి నుంచి బీసీలకు రెండు సార్లు మాత్రమే స్వయం ఉపాధి లోన్లు ఇచ్చారు. 2015లో ఒకసారి, 2018లో మరోసారి ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో 5.70 లక్షల మంది అప్లయ్ చేసుకున్నారు. ఎలక్షన్ ఇయర్ కావడంతో 50 వేల మందికి లోన్లు ఇచ్చారు. 5.2 లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. తమకు లోన్ ఎప్పుడిస్తారని దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. బీసీ సంక్షేమ శాఖ అధికారులు లోన్ల కోసం యాక్షన్ ప్లాన్లు రూపొందిస్తున్నా సర్కారు మాత్రం అప్రూవ్ చేయడంలేదు.
ఫెడరేషన్లకు ఒక్క పైసా ఇస్తలే
రజక, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, కృష్ణ బలిజ, పూసల, వాల్మీకి/బోయ, భట్రాజు, మేదర, విశ్వబ్రాహ్మణ, కుమారి శాలివాహన, గీత పనివారలు, సగర(ఉప్పర) ఫెడరేషన్లు ఉన్నాయి. ఆయా ఫెడరేషన్ల నుంచి సబ్సిడీ రుణాలు అందజేయడం, కులవృత్తులపై శిక్షణ ఇవ్వడం, సబ్సిడీ కింద వివిధ మెషీన్లు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఫెడరేషన్లకు ప్రభుత్వం మూడేండ్ల నుంచి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించడంలేదు. దీంతో ఫెడరేషన్లు ఖాళీగా ఉంటున్నాయి. కుల వృత్తిదారులకు ట్రైనింగ్లు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పొందుపర్చినా కొత్తగా ఒక్కటీ ఏర్పాటు చేయలేదు.
ఎంబీసీ కార్పొరేషన్కు నిధుల్లేవ్.. చైర్మన్ లేరు
తెలంగాణ వచ్చేనాటికి బీసీలకు బీసీ కార్పొరేషన్ ఒక్కటే ఉంది. 2014లో ఇచ్చిన హామీ మేరకు 2016లో ఎంబీసీ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్న 35 సంచార జాతుల కులాలను ఈ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చారు. కానీ జిల్లాల వారీగా సంచార జాతుల జనాభాను గుర్తించి, వారి అభివృద్ధి కోసం చేయాల్సిన పనులపై ప్లాన్లు రూపొందించలేదు. మొదటి మూడేండ్లలో రూ.2,433 కోట్లు బడ్జెట్లో పెట్టారు. అందులో రూ.350 కోట్లే మంజూరయ్యాయి. వాటిలోనూ రూ.89.79 కోట్లే కార్పొరేషన్ ఖాతాలో జమ చేశారు. తర్వాత బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. ఇటీవల బడ్జెట్లో రూ. 500 కోట్లు పెట్టినా ఒక్కపైసా విడుదల చేయలేదు. కార్పొరేషన్కు చైర్మన్ కూడా లేరు.
మోడర్న్ హెయిర్ సెలూన్ల ముచ్చటేమాయె?
హెయిర్ సెలూన్లలో కావాల్సిన పరికరాల కొనుగోలు కోసం నాయీ బ్రాహ్మణులకు సబ్సిడీ ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పేర్కొంది. కానీ ఇప్పటికీ ఆ దిక్కు అడుగుముందుకు పడలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మోడర్న్ హెయిర్ సెలూన్ల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు రెండోసారి జరిగినా ఆ హామీ అమలు కాలేదు. దేవాలయాల్లోని కళ్యాణకట్టలో పనిచేసే క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా దానికీ అతీగతీ లేదు.
నేతన్నలకు బీమా ఏదీ? హెల్త్ కార్డులేవి?
చేనేత కార్మికులకు 50 శాతం సబ్సిడీపై నూలు, రైతుల మాదిరి 5 లక్షల బీమా, హెల్త్కార్డులు ఇస్తామని చెప్పినా ఏవీ అమలు కావడంలేదు. తెలంగాణ వచ్చినప్పుడు 470 సహకార సంఘాలు ఉండగా, ఇప్పుడు 220కి తగ్గాయి. ఎక్స్పోర్ట్ వ్యవస్థను తయారు చేస్తామని, హ్యాండ్లూమ్ కార్పొరేషన్, పవర్లూం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినా పత్తాలేవు. వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ నిర్మాణంలోనే ఉంది. 9 నెలలు కావస్తున్నా చేనేత పొదుపు పథకాన్ని పునరుద్ధరించడం లేదు.
ఎలక్షన్లప్పుడే గొర్రెల పంపిణీ
రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమం రెండేండ్లుగా నిలిచిపోయింది. 7. 29 లక్షల గొల్లకురుమ కుటుంబాలకు గొర్రెల యూనిట్లు అందించాలని నిర్ణయించినా.. మొదటి విడత పంపిణీనే పూర్తి కాలేదు. గొర్రెల యూనిట్ల కోసం ఒక్కొక్కరు రూ. 31,250 చొప్పున డీడీలు తీశారు. అనేక మంది బంగారం కుదువపెట్టి, ప్రైవేటు వడ్డీలు తీసుకుని డీడీలు కట్టారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 3.63 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఎన్నికలప్పుడే గొర్రెల పంపిణీ చేపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. చేప పిల్లల పంపిణీ చేపట్టామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్నా ఏటా టార్గెట్ను మాత్రం అందుకోవడం లేదు.
ఆత్మగౌరవ భవనాల అడ్రస్ లేదు
హైదరాబాద్లో 46 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 73 ఎకరాల భూమి, రూ. 53 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ మూడేండ్లు దాటినా ఇంకా ఒక్క భవనం కూడా పూర్తి కాలేదు. కొన్నింటికి పునాదులు తీయలే.. ఇంకొన్నింటికి ముగ్గు కూడా పోయలే. ఇటీవల పాత సెక్రటేరియట్ను కూల్చి.. కొత్త సెక్రటేరియట్ కోసం చకచకా పనులు సాగిస్తున్నారు. కానీ.. బీసీఆత్మ గౌవర భవనాల నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా బీసీ సబ్ ప్లాన్ను పకడ్బందీగా చట్ట పద్ధతిలో తెస్తరాఅని సభ్యులు అడుగుతున్నరు. తర్వాతి ఫైనాన్షియల్ ఇయర్లో వంద శాతం తెస్తం. మన రాష్ట్రమే వీకర్ సెక్షన్ రాష్ట్రం. ఎవరికీ శషభిషలు ఉండాల్సిన అవసరం లేదు. అపోహలు అక్కర్లేదు. తర్వాతి ఫైనాన్షియల్ ఇయర్లో బీసీ సబ్ ప్లాన్ తెస్తం. చట్టం కూడా ఇదే సభలో పాస్ చేస్తం. ‑ 2017 మార్చిలో శాసనసభలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి
సబ్ ప్లాన్ వస్తే రూ.10 వేల కోట్లకు పైగా స్పెషల్ బడ్జెట్
బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తే ఏటా బీసీ సంక్షేమశాఖకు ఇప్పుడు బడ్జెట్లో కేటాయించే దానికంటే అదనంగా మరో రూ. 10 వేల కోట్లు సమకూరుతాయి. దీని ద్వారా బీసీలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసే వెసులుబాటు ఉంటుంది. ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కానీ, ప్రభుత్వం సబ్ప్లాన్ పేరిట నాలుగేండ్ల కింద సమావేశాలు పెట్టి అటకెక్కించింది.
దోభీఘాట్లు కట్టియ్యలే..
రజకుల కోసం దోభీఘాట్లను ఏర్పాటు చేస్తామని 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. 2018 ఆగస్టులో ప్రగతి భవన్లో రజక సంఘం నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. రజకుల కోసం ప్రత్యేక కార్యక్రమా లు చేపడతామని చెప్పారు. ప్రభుత్వ హాస్పి టళ్లు, హాస్టళ్లు, గురుకులాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పనులను అప్పగిస్తామ న్నారు. దోభీఘాట్లను నిర్మిస్తామని, డ్రైయింగ్ మెషీన్లను అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఏవీ అమలుకాలేదు.
బీసీలకు చేసిందేమీ లేదు
తెలంగాణ వస్తే అన్ని వర్గాలు బాగుపడతాయని ఆశించాం. బీసీలకు న్యాయం జరుగుతదని భావించాం. కానీ ఉమ్మడి ఏపీ కంటే తెలంగాణ రాష్ట్రంలో మరింత వెనుకబాటుకు, అణిచివేతకు గురవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించడం దారుణం.
- ఆర్.కృష్ణయ్య,
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్
బీసీ సబ్ప్లాన్ ఎందుకు తెస్తలే?
బీసీ సమస్యలపై 3 రోజులు చర్చించారు. మొదటి రోజు సీఎం కేసీఆర్ అటెండయ్యారు. ఏం కావాలంటే అది చేస్తా అన్నరు. మంత్రులు కులాలవారీగా సమాశమయ్యారు. బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికీ సబ్ప్లాన్కు అతీగతీలేదు. ఎన్నికలు వచ్చినప్పుడే టీఆర్ఎస్కు బీసీలు గుర్తుకొస్తరు.
- జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్
హామీలు ఎటుపోయినయ్?
నాయీ బ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకుంటామని గొప్పలు చెప్పారు. మోడర్న్ సెలూన్లు అని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇంకా అమలుకాలేదు. సబ్సిడీపై పరికరాలు ఇస్తామని చెప్పినా దిక్కులేదు. ఓట్లప్పుడు మాత్రం చల్లగా వచ్చిపోతరు. తర్వాత ఎవరూ పట్టించుకోరు. చేతకానప్పుడు ఎందుకు హామీలు ఇయ్యాలి?
- దుగ్యాల మహేశ్, నాయీ బ్రాహ్మణుడు, నల్గొండ