రాష్ట్ర వ్యాప్తంగా‘పంచాయతీ’సమ్మేళనాలు

రాష్ట్ర వ్యాప్తంగా‘పంచాయతీ’సమ్మేళనాలు

హైదరాబాద్ , వెలుగు:స్థానిక ప్రజాప్రతినిధులకు కొత్త పంచాయతీరాజ్​ చట్టంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగుచోట్ల త్వరలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు నిర్వహించాలని  సర్కారు భావిస్తోంది. ఇటీవల నిర్వహించిన పలు సమీక్ష సమావేశాల్లో ఈ విషయాన్ని సీఎం వెల్లడించగా, ఆమేరకు పంచాయతీరాజ్​శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

పంచాయతీరాజ్​ చట్టంపై అవగాహనే లక్ష్యం

రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో నిర్వహించాలని భావిస్తున్న పంచాయతీ సమ్మేళనాలకు సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మొదలుకొని జెడ్పీ చైర్​పర్సన్ల వరకు అందరినీ ఆహ్వానించనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల విధులు, బాధ్యతలను వివరించడంతోపాటు కొత్త పంచాయతీరాజ్ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. కొత్తగా నియమితులైన పంచాయతీ కార్యదర్శులకు కూడా 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.   ఈ నెల చివరనగానీ, వచ్చే నెల మొదటి వారంలోగానీ మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికల తర్వాతే మేడ్చల్, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్​నగర్​లలో సమ్మేళనాలను నిర్వహించాలని పంచాయతీరాజ్​శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు  హాజరయ్యేలా చూడాలని భావిస్తున్నారు. శిక్షణకు అవసరమయ్యే పుస్తకాలను రాజేంద్రనగర్ లోని తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ముద్రిస్తోంది. పంచాయతీ కార్యదర్శుల కోసం మరో మూడు హ్యాండ్ బుక్కులను ప్రింట్​ చేస్తోంది. కాగా, పంచాయతీ సమ్మేళనాల ముసాయిదా ప్రతిపాదన ఇప్పటికే సీఎం కేసీఆర్​ను చేరినట్లు తెలుస్తోంది. ఆయన ఆమోదం అనంతరం పంచాయితీ రాజ్ శాఖ అధికారులు త్వరలోనే తేదీలను ఖరారు చేసే అవకాశముంది.