
- 35వేల మంది అభ్యుదయ రైతులకు చేరిన సీడ్
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సహకారంతో చేపట్టిన ‘గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం’ కార్యక్రమం విజవంతంగా ముగిసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూన్ 2న ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు దాదాపు 2,500 క్వింటాళ్ల నాణ్యమైన మూల విత్తనాన్ని ఎంపిక చేసిన 35వేల మంది అభ్యుదయ రైతులకు పంపిణీ చేసినట్టు చెప్పారు.
వరిలో 20వేలు, జొన్నలో 1,522, కందిలో 4,568, పెసరలో 8,910 విత్తన కిట్లను రైతులకు అందించామని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 2,192 కిట్లను, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 379 విత్తన కిట్లను పంపిణీ చేశామని వివరించారు. రైతాంగానికి నాణ్యమైన విత్తనం అందించాలనే లక్ష్యంతో గత నాలుగు నెలలుగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అగ్రికల్చర్ వర్సిటీ, అగ్రికల్చర్శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని వెల్లడించారు.