2011 కంటే ముందు డిగ్రీ పాసైతే డీఎస్సీకి అర్హులే

2011 కంటే ముందు డిగ్రీ పాసైతే డీఎస్సీకి అర్హులే

హైదరాబాద్, వెలుగు: డిగ్రీలో మార్కులు తక్కువగా ఉన్న విద్యార్థులకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పబోతున్నది. 2011 కంటే ముందు డిగ్రీ పాసైన అభ్యర్థులందరినీ మార్కులతో సంబంధం లేకుండా డీఎస్సీకి అర్హులుగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్ లో డిగ్రీతో పాటు బీఈడీ పాసై ఉండాలి. డిగ్రీలో ఓసీలకు 50% మార్కులు, బీసీ,  ఎస్సీ, ఎస్టీలకు 45% మార్కులుంటేనే డీఎస్సీ కి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీనిపై కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్​సీటీఈ) కొన్ని మార్పులు చేసింది. 

2011 జూలై 29 కంటే ముందు పాసైన వారందరూ మార్కులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు అర్హులేనని ఎన్​సీటీఈ గెజిట్ జారీ చేసింది. ఆ తర్వాత పాసైన వారికి ఓసీలకు 45%,   ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతరులకు 40% మార్కులుంటే సరిపోతుందని మరో ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ రెండింటినీ ప్రస్తుతం డీఎస్సీ–2024 నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది. త్వరలోనే దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే డీఎస్సీ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, సుమారు 14 వేల దరఖాస్తులు వచ్చాయి.