V6 News

వరద సహాయక చర్యలపై వివరాలివ్వండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

వరద సహాయక చర్యలపై వివరాలివ్వండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వరదలకు సంబంధించి చేపట్టిన సహాయక చర్యలపై వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విపత్తుల నిర్వహణ చట్టం కింద గతంలో జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై నివేదికను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. విచారణను సెప్టెంబరు 17కు వాయిదా వేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 2020లో డాక్టర్‌‌ సీహెచ్‌‌.సుధాకర్‌‌ హైకోర్టులో పిల్‌‌ దాఖలు చేశారు.

 ఇందులో భాగంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సతమతమవుతున్న ప్రజలను ఆదుకోవడానికి విపత్తుల నిర్వహణ చట్టం కింద కనీస సహాయక చర్యలు చేపట్టకపోవడంపై మధ్యంతర పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై ప్రదాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌తో కూడిన బెంచ్‌‌ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌‌ వాదించారు.