హైదరాబాద్, వెలుగు : కట్నం వేధింపులతో ఆత్మహత్యకు కారణమయ్యారంటూ నమోదైన కేసును కొట్టి వేసేందుకు సూసైడ్ నోట్లో పేర్లు లేవన్న కారణం సరిపోదని హైకోర్టు తేల్చి చెప్పింది. సూసైడ్ నోట్ అన్నది ఎన్సైక్లోపీడియా కాదని, అందులోని అంశాలతో పాటు సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.
అదనపు కట్నం వేధింపులపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడకు చెందిన చెన్నబోయిన సాయి కృష్ణ, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జె.శ్రీనివాసరావు విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు.
వివరాల్లోకి వెళ్తే... సాయికృష్ణకు సౌందర్య అనే యువతితో 2019లో వివాహమైంది. 16 నెలల తర్వాత వివాదాలు మొదలుకావడంతో సౌందర్య పుట్టింటికి వచ్చింది. తర్వాత పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి సౌందర్యను అత్తారింటికి పంపించారు. ఈ క్రమం 2023లో సౌందర్య ఆత్మహత్య చేసుకుందంటూ సమాచారం అందడంతో కేసు నమోదైంది. పెండ్లి సమయంలో ఇచ్చిన 25 తులాల బంగారం, రూ. 4 లక్షలకు అదనంగా మరో రూ.10 లక్షలతో పాటు సౌందర్య వేతనం కూడా ఇవ్వాలంటూ అత్తింటి వారు వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే సూసైడ్నోట్లో పేర్లు లేవని, అదనపు కట్నం కోసం వేధించినట్లు చెప్పలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. వాదనలను, రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి అదనపు కట్నం కోసం వేధించారన్న ఆరోపణలు తుది నివేదికలోను, సాక్షుల వాంగ్మూలాల్లోనూ ఉన్నాయన్నారు. వీటి ఆధారంగా వాస్తవాలను నిర్ధారించడానికి విచారణ కొనసాగించాల్సిందేనని, తుది నివేదికను ప్రాథమిక స్థాయిలోనే రద్దు చేయడం సాధ్యం కాదని కోర్టు చెప్పింది.
