- సుప్రీంకోర్టుకు పిటిషన్ బదిలీ చేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో 40 కుక్కలను చంపిన సంఘటనలో ఆదేశాలివ్వలేమని హైకోర్టు బుధవారం తేల్చిచెప్పింది. ప్రస్తుతం వీధి కుక్కలకు సంబంధించి అన్ని అంశాలపై సుప్రీంకోర్టు విచారిస్తున్నందున ఈ పిటిషన్ను అక్కడికి బదిలీ చేస్తామని తెలిపింది. పిటిషన్ను సుప్రీంకోర్టుకు బదిలీ చేయడానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. సింబయాసిస్ యూనివర్సిటీతోపాటు పరిసర ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది 40 కుక్కలను చంపడంపై క్రిమినల్ కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన న్యాయవాది వి.రిషిహాస్ రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఒకేరోజు 40 కుక్కలను చంపించారని తెలిపారు. భవిష్యత్తులోనైనా కుక్కలను చంపకుండా ఆదేశాలివ్వాలని కోరగా పిటిషన్లోని ఆరోపణలకు ఆధారాలేమిటని ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది స్పందిస్తూ.. విద్యార్థులు చెప్పారని పత్రికల్లో కథనాలు వచ్చాయని సమాధానమిచ్చారు. అందుకు ధర్మాసనం విద్యార్థులు ఈ మేరకు అఫిడవిట్ ఇస్తారా అంటూ ప్రశ్నించింది.
