
హామీలు ఇచ్చుడేనా.. అమలు చేయరా?
కరోనా కట్టడిపై రాష్ట్ర సర్కార్ ను నిలదీసిన హైకోర్టు
అమలు కాని హామీలతో ఉపయోగమేంటని కామెంట్
హైదరాబాద్, వెలుగు: కరోనా కట్టడి చర్యల విషయంలో రాష్ట్ర సర్కార్ హామీలు ఇస్తూ పోతోందని, కానీ వాటి అమలు విషయంలోనే సందేహాలు ఉన్నాయని హైకోర్టు కామెంట్ చేసింది. కరోనా టెస్టులను పెంచి మళ్లీ ఎందుకు తగ్గించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆక్సిజన్ బెడ్స్ ను పెంచేందుకు తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించింది. టెస్టులు ఎక్కువగా చేస్తలేరని, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫీజుల దోపిడీ, ఇతర అంశాలపై ఫైల్ అయిన పిల్స్ పై చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిల డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది.
రోజుకు 40వేల టెస్టులు ఏమైనయ్..
పేపర్లలో వస్తున్న స్టోరీలను బట్టి ఆక్సిజన్ బెడ్స్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని హైకోర్టు పేర్కొంది. డబ్ల్యూహెచ్వో లెక్కల ప్రకారం వెయ్యి మందికి 5 ఆక్సిజన్ బెడ్స్ ఉండాలని, కానీ రాష్ట్రంలో ఒక్కటే ఉందని చెప్పింది. ఆక్సిజన్ బెడ్స్ ను పెంచుతామని ప్రభుత్వం గతంలోనే చెప్పిందని, కానీ అది ఆచరణకు నోచుకోలేదని తెలుస్తోందంది. ఇలా అమలు కాని హామీలిచ్చి ఉపయోగం ఏమిటని కామెంట్ చేసింది. అలాగే రోజుకు 40వేల టెస్టులు చేస్తామని చెప్పి, ఇప్పుడెందుకు చేయడం లేదని నిలదీసింది. టెస్టులు తగ్గించడానికి కారణాలు ఏంటో చెప్పాలంది. ఏజీ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్రావు తండ్రి మరణించారని, అందుకే రిపోర్టు ఇవ్వడం ఆలస్యం అవుతోందని చెప్పారు. వివరాలు ఇచ్చేందుకు టైమ్ కావాలని కోరారు. అక్టోబర్ 6 నాటికి రిపోర్టు ఇస్తే, అదే నెల 8న విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.
For More News..