
- తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నం: సీతక్క
- ఆదిమ జాతుల ఆర్థిక ప్రగతిపై ఫోకస్ చేస్తున్నట్టు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అందుకోసమే తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమాన్నిప్రారంభిస్తున్నామని చెప్పారు. బుధవారం తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమం (తెలంగాణ ఇన్క్లూసివ్ లైవ్లిహుడ్ ప్రోగ్రామ్ )పై సెక్రటేరియెట్ లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అత్యంత వెనకబడిన ఆరు వేల కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అభాగ్యులు, నిర్భాగ్యులకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తున్నదని పేర్కొన్నారు.
అత్యంత వెనకబడిన కుటుంబాలను, వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేలా ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండేండ్లపాటు ఆయా కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. ఆదిమ జాతులు అంతరిస్తున్నాయని, వాటి పరిరక్షణ కోసం బ్రాక్ సంస్థతో కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణ సమ్మిళిత జీవనోపాధి పథకంలో భాగస్వాములుగా ఉన్న బ్రాక్ ఇంటర్నేషల్, ఆగాఖాన్ ఫౌండేషన్, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్కీమ్స్ అండ్ పాలసీస్, ప్రధాన్, ట్రికిల్ అప్ సంస్థలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని చెంచుపేటలో పర్యటించి చెంచుల జీవన స్థితిగతులను తెలుసుకున్న కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ సెక్రటరీ స్మ్రితి శరణ్ను సీతక్క శాలువాతో సన్మానించారు.