ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిధుల చెల్లింపుపై గైడ్​లైన్స్

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు  నిధుల చెల్లింపుపై గైడ్​లైన్స్
  • జీఓ విడుదల చేసిన హౌసింగ్  సెక్రటరీ

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు నిధుల చెల్లింపులకు సంబంధించి అధికారులు నిర్వర్తించాల్సిన విధులపై ప్రభుత్వం గైడ్ లైన్స్  విడుదల చేసింది. ఈ అంశంపై హౌసింగ్  సెక్రటరీ జ్యోతి బుద్దప్రకాశ్  శనివారం  జీఓ 259ని జారీ చేశారు. గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు ఆఫీసర్లు, హౌసింగ్  ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఇంజినీర్, జిల్లా స్థాయిలో ప్రాజెక్టు డైరెక్టర్ల విధులను ఈ జీఓలో పేర్కొన్నారు. 

పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో ఇంటి నిర్మాణాలను తనిఖీ చేయడం, నిర్మాణం స్టార్ట్  చేయని వారిని ఇంటి నిర్మాణం ప్రారంభించేలా ప్రోత్సహించడం, లబ్ధిదారుల బ్యాంక్, ఆధార్  వివరాలు సేకరించి తనిఖీ చేయడం, ఇంటి నిర్మాణంలో ప్రభుత్వ గైడ్ లైన్స్  ఫాలో అవుతున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలించడం వంటివి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటి నిర్మాణాన్ని  అసిస్టెంట్  ఇంజినీర్ 4 సార్లు తనిఖీ చేయాలన్నారు. ఏఈలు ఇచ్చిన సమాచారాన్ని కూడా తనిఖీ చేసి జిల్లా ప్రాజెక్ట్  డైరెక్టర్ కు పంపాలని పేర్కొన్నారు. లబ్ధిదారులకు 4 దశల సాయంపై పీడీలు జిల్లా కలెక్టర్ కు, హౌసింగ్  కార్పొరేషన్  ఎండీకి పంపాలని ఉత్తర్వుల్లో హౌసింగ్  సెక్రటరీ పేర్కొన్నారు. మున్సిపల్  కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్  ప్రాజెక్టు డైరెక్టర్లు విజిలెన్స్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు.