42 శాతం బీసీ రిజర్వేషన్లపై..అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి..పెండింగ్ బీసీ బిల్లులపై ప్రధాని మోదీని నిలదీయాలి: కవిత

42 శాతం బీసీ రిజర్వేషన్లపై..అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి..పెండింగ్ బీసీ బిల్లులపై ప్రధాని మోదీని నిలదీయాలి: కవిత
  • బతుకమ్మ లేని తెలంగాణ తల్లి.. తెలంగాణ తల్లే కాదు
  • రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్​ఎస్, బీజేపీ ఫెయిల్​
  • ట్యాంక్​బండ్​తో పాటు అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. మున్సిపల్​ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించలేదని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా కల్పించాలని డిమాండ్​ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అఖిలపక్షాన్ని ప్రభుత్వం ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. పెండింగ్​లో ఉన్న బీసీ బిల్లులకు ఆమోదం లభించేలా ప్రధాని మోదీపై సీఎం రేవంత్​ రెడ్డి ఒత్తిడి చేయాలన్నారు.

శుక్రవారం ఆమె ట్యాంక్​బండ్​ వద్ద ఏర్పాటు చేస్తున్న మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు బడ్జెట్​లో ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. గత రెండు బడ్జెట్​లలో బీసీలకు తక్కువ కేటాయింపులు చేశారని, అందులోనూ 30 శాతం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ తల్లే కాదని, ప్రభుత్వం పెట్టే కాంగ్రెస్​ తల్లి బొమ్మకు ప్రజల ఆమోదం ఉండదన్నారు. బలవంతంగా ఒక ప్రతీకను ప్రజల మీద రుద్దే ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు కాంగ్రెస్​ సర్కార్​ వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. 

అగ్రకులాలకే కార్పొరేషన్​ పదవులు

కార్పొరేషన్ల పదవులు కూడా అగ్రకులాల వారికే ఇస్తున్నారని, బీసీ, మహిళ, మైనారిటీలకూ కార్పొరేషన్​ పదవులు ఇవ్వాలని కవిత డిమాండ్​ చేశారు. ఆర్. కృష్ణయ్య, జాగృతి లాంటి సంస్థల పోరాటం ఫలితంగా బీసీల్లో చైతన్యం పెరిగిందని, మొన్న జరిగిన ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ స్థానాలు దక్కేందుకు ఆ చైతన్యమే కారణమని చెప్పారు. రాజకీయ రిజర్వేషన్లకు అడ్డంకులు ఉన్నాయే తప్ప బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఎలాంటి అడ్డంకులు లేవని, ఆ రిజర్వేషన్లనైనా అమలు చేయాలని కోరారు.

రాష్ట్రంలో తామే ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నామని చెప్పారు. చాలా చోట్ల ప్రజలు ఏ పార్టీకీ మెజారిటీ ఇవ్వలేదని, అన్ని పార్టీలనూ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. హంగ్  వచ్చిన చోట కాంగ్రెస్​ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​, బీజేపీ ఫెయిల్​ అయ్యాయి కాబట్టే.. కాంగ్రెస్​కు అన్ని సీట్లు వచ్చాయన్నారు. 

ఫూలే విగ్రహ ఏర్పాటు మా పోరాటం వల్లే

ఫూలే విగ్రహ ఏర్పాటుకు జాగృతి తరఫున రెండేండ్లుగా పోరాడుతున్నామని, తమ పోరాటంతోనే ప్రభుత్వం దిగివచ్చి ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నదని కవిత చెప్పారు. ఒక్క ట్యాంక్​బండ్​పైనే కాకుండా.. అసెంబ్లీలో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టాలన్నదే తమ డిమాండ్​ అన్నారు. కాంగ్రెస్​ ఆ పని చేయకుంటే.. జాగృతి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ పనిచేస్తామన్నారు.

కాగా.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన ప్రొఫెసర్​ జయశంకర్​ సార్​ విగ్రహాన్ని ట్యాంక్​బండ్​పై ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం స్థలం ఇస్తే జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుతో పాటు నిర్వహణకు అయ్యే ఖర్చు జాగృతి భరిస్తుందన్నారు