- జీతాలను రూ.10 వేలకు పెంచాలె.. 1వ తేదీనే ఇవ్వాలె
- నవంబర్ ఆఖరు వరకు డిమాండ్లు నెరవేర్చకుంటే ఉద్యమిస్తం
- రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మండల పరిషత్లకు సంక్రమించిన 29 అధికారాలను ఎంపీటీసీ సభ్యులకు బదిలీ చేసి, నిధులు కేటాయించాలని తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని లక్డీకాపూల్లో సోమవారం ఎంపీటీసీల రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్లకు ఉన్న హక్కులు, అధికారాలన్నీ ఎంపీటీసీలకూ కల్పించాలని కోరారు. ఏటా ఒక్కో ఎంపీటీసీకి రూ.10 లక్షల నిధులు మంజూరు చేయాలని, మండల పరిషత్ పాఠశాలల్లో ఆగస్టు15న జాతీయ పతాకం ఎగురవేసే అవకాశం ఇవ్వాలన్నారు. ఎంపీటీసీల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇస్తున్నట్లుగానే ప్రతి నెలా1వ తేదీన తమకు కూడా జీతాలు ఇవ్వాలన్నారు. గ్రామాల్లో అమలు చేసే కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మండల పరిషత్ల ద్వారానే నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నవంబర్ నెలాఖరులోగా పరిష్కరించకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.